వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈఏడాది కూడా అక్టోబర్ 30న ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, మీడియా అవార్డుల కమిటీ చైర్మన్ ఆర్.నాగరాజు పట్నాయక్లు తెలిపారు. సోమవారం విశాఖలోని డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్క్లబ్లో శ్రీనుబాబు అధ్యక్షతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సభ్యులంతా సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం కార్యదర్శి దాడి రవికుమార్తో కలసి మీడియాతో మాట్లాడారు. తమ పాలకవర్గం హయంలో జర్నలిస్టుల, కుటుంబ సభ్యులు వైద్య ఖర్చులు, మృతుల ఖర్చుల కోసం సుమారు రూ.23లక్షలు వెచ్చించినట్టు పేర్కొన్నారు.
అలాగే దీపావళి నిర్వహణతో పాటు 30న ఏయూ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ప్రతిభావంతులైన జర్నలిస్టులకు మీడియా అవార్డులు అందజేస్తామన్నారు. కపిలగోపాలరావు, మసూనా మాస్టార్ అవార్డులతో పాటు పలు కేటగిరిల్లో ప్రిండ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో, వీడియో, వెబ్ జర్నలిస్టులకు 32 మందికి నగదు, ప్రశంసపత్రాలు, అవార్డులు అందిస్తామని చెప్పారు. జర్నలిస్టుల పిల్లలకు సుమారు 150 మందికి ఉపకార వేతనాలు అందించేందుకు తుది జాబితాను సిద్దం చేశామన్నారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా గంట్ల శ్రీనుబాబు వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. సీతమ్మధారలోని నార్ల భవన్ మరమ్మత్తులు త్వరలో చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఇక విజెఎఫ్కు సంబంథించి నాలుగు వ్యాజ్యాల్లో అనుకూలంగా తీర్పులు రావడంతో ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే ఏడాది ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించడానికి కార్యవర్గం తీర్మానించిన విషయాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున్కు తెలియజేసి సజావుగా ఎన్నికల నిర్వహణకు తగిన సహయం అందించాలని కోరామన్నారు. న్యాయ పరంగా కేసులు పెండింగ్లో ఉండటం వల్లే ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగిందని..కావున సభ్యులంతా తమకు గతంలో మాదిరిగానే సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్య క్షుడు టి.నానాజీ, కోశాధికారి పిఎన్ మూర్తి, కార్యవర్గ సభ్యులు పి,వరలక్ష్మీ, ఇరోతి ఈశ్వరరావు, ఎంఎస్ఆర్ ప్రసాద్, పి.దివాకర్,డి.గిరిబాబు, డేవిడ్, గయాజ్,శేఖర్ మంత్రి, సనపల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.