ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా ఎన్నికలు, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ కృతికా శుక్లా..రెవెన్యూ, ఎన్నికల శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. వర్షాలు తరుచుగా కురుస్తున్నందున ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో బీవి.రమణ, పట్టణ తహసీల్దార్ వైహెచ్ఎస్ సతీష్, కాకినాడ పట్టణ, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు సీహెచ్ లక్ష్మి ప్రసన్న, ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.