తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, విశాఖపట్నం కార్తీక మహా దీపోత్సవం కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరుగనున్న కార్తీక మహాదీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్ తెలిపారు. విశాఖ నగరంలోని ఎంవిపి కాలనీలోని టిటిడి కళ్యాణ మండపంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఈవో మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు రామకృష్ణ బీచ్ కాళీ మాత అమ్మవారి గుడి ఎదురుగా సాగర తీరాన అంగరంగ వైభవంగా కార్తీక మహా దీపోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామి మంగళాశాసనాలు అందిస్తారని వెల్లడించారు. టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొంటారని తెలిపారు. విష్ణుసహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు పారాయణం చేస్తారని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏబి.బాలకొండల రావు బృందంతో నృత్యం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తనల ఆలాపన జరుగుతాయన్నారు.
అంతకుముందు టిటిడి ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం రామకృష్ణ బీచ్ వద్ద గల
దీపోత్సవం వేదిక పనులను పరిశీలించారు. ఆర్డీవో హుస్సేన్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో దాతలు రాజేష్, హిమాంశుప్రసాద్, టిటిడి ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, పిఆర్ఓ డా.టి.రవి, డిఇ రవిశంకర్ రెడ్డి, డిఎఫ్ఓ శ్రీనివాస్, విజివో మనోహర్ పాల్గొన్నారు.