ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రముఖ వైద్య శాలయిన కె.జి.హెచ్ కు ప్రతి రోజు అనేక మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారని వారికి కనీస సౌకర్యాలు అందేటట్లు వైద్య సిబ్బంది చూడాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కె.జి.హెచ్ ఆసుపత్రిలో ఒపి స్లిప్, కేస్ షీట్లు మంజూరు చేయు గదిని, క్యూలైన్లను పార్కింగ్ ప్రదేశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేస్ షీట్లు మంజూరు చేయు గదిని మరమ్మత్తులు చేయాలని అదే విధంగా రోగులు ఒపి స్లిప్ లు పొందేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. రోగులతో పాటు వచ్చే వారికి కూడా మరుగుదొడ్లు ఇబ్బంది లేకుండా నిర్మించాలన్నారు. పార్కింగ్ సదుపాయాన్ని మెరుగు పర్చాలన్నారు . ఓపి గేటు ఎదురుగా ఉన్న మినీ పార్కును సుందరీకరించాలని ఆదేశించారు. అనంతరం వైద్యం కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్నవైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కె.జి.హెచ్ సూపరింటెండెంట్ మైథిలీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.