ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మనందరి మదిలో చిరస్థాయిగా మిగిలారని జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున అన్నారు. గురువారం ఉదయం పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి కలెక్టర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని ,తన త్యాగాల ఫలితంగా తెలుగు రాష్ట్రం సాధించిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేషకృషి చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న మహోన్నతుడు అని, ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అన్నారు.
మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం పనిచేసిన మహనీయుడు శ్రీరాములు అని తెలిపారు. ఆయన పేరుతో జిల్లా ఉండటం ఆయన త్యాగాలకు గుర్తుగా నిలుస్తాయన్నారు. అటువంటి మహనీయుడుని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలసిన తరుణమిదని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ .శ్రీనివాస్ మూర్తి, , సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ వి.మణిరామ్, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.