పి.ఎం.కిసాన్ పథకం కింద వచ్చే జనవరి నెలలో విడుదల చేసే ప్రోత్సాహక మొత్తాలు రూ.2,000 పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కే.వై.సి చేయించు కోవలసి వుంటుందని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి తెలిపారు. రైతులు ఇకేవైసి చేయించుకొనేందుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు వుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నమోదు చేయించుకోని రైతులు వెంటనే తమ గ్రామంలోని రైతుభరోసా కేంద్రానికి వెళ్లి తమ వివరాలతో ఈ-కేవైసి నమోదు చేయించుకోవడం ద్వారా పి.ఎం. కిసాన్ పథకం ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. జిల్లాలో విజయనగరం రూరల్, భోగాపురం, గరివిడి, పూసపాటి రేగ, గుర్ల, నెల్లిమర్ల, వేపాడ, కొత్తవలస, చీపురుపల్లి, డెంకాడ, రామభద్రపురం, రాజాం తదితర 12 మండలాల్లో సుమారు 60 వేల మంది రైతులు ఇంకా ఈ-కేవైసి చేయించుకోవాల్సి వుందన్నారు. జిల్లాలో 2.48 లక్షల మంది రైతులకు గాను 1.67 లక్షల మంది రైతులు మాత్రమే ఇప్పటి వరకూ ఈ-కెవైసి చేయించు కున్నట్టు తెలిపారు.