పాలీసెట్ పకడ్బందీగా నిర్వహించాలి..జెసి


Ens Balu
2
కలెక్టరేట్
2020-09-24 18:59:17

విశాఖ జిల్లాలో ఈ నెల 27వ తేదీన జరుగనున్న  "పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్ )- 2020 "  ను  సజావుగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాలరెడ్డి తెలిపారు. గురువారం నాడు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో  "పాలిసెట్" నిర్వహణపై  సాంకేతిక విద్యా శాఖ,  పోలీసు, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, జి.వి.ఎం.సి,  పంచాయితీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా లో  మొత్తం 56 పరీక్షా కేంద్రాలలో 15,755 మంది అభ్యర్ధులు పరీక్ష వ్రాయనున్నారని తెలిపారు. రెవెన్యూ, పోలీసు, విద్యా శాఖల అధికారుల బృందాలు ప్రత్యేక  ప్లయింగ్ స్కాడ్ గా పర్యవేక్షిస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు  ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించాలని,  ఎగ్జామ్ మెటిరియల్ ను పరీక్షా కేంద్రాలకు తీసుకు వెళ్లడానికి  ఎస్కార్డ్ ఏర్పాటు చేయాలని  పోలీసు శాఖను  కోరారు. వైద్యఆరోగ్య శాఖ పరీక్షా కేంద్రాల వద్ద వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, కోవిడ్ నిబంధనలను  పాటించాలని కోరారు.  పరీక్షా కేంద్రాలను శానిటైజ్  చేయాలని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని జి.వి.ఎం .సి, పంచాయితీ రాజ్ శాఖ అధికారులను  కోరారు. పరీక్షా కేంద్రాలకు అంతరాయం  లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఈ పి డి సి ఎల్ అధికారులను కోరారు. సమయానికి పరీక్షా కేంద్రాలకు  చేరుకునేందుకు  వీలుగా, తిరిగి వెళ్ళేందుకు గాను ఆదివారం నాడు  ప్రత్యేక బస్సులను  ఏర్పాటు చేయాలని ఆర్టీసి  అధికారులను కోరారు.