శ్రీనివాస సేతు మూడవ దశలో నిర్మాణంలో ఉన్న దాదాపు 6 స్టీల్ గర్డర్ లను రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని ఏప్రిల్ 15వ తేదీ లోపు అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో శనివారం తిరుపతి మున్సిపల్ కమిషనర్ కుమారి అనుపమ అంజలితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రామానుజ సర్కిల్ నుండి రేణిగుంట వైపు, తిరుచానూరు మార్కెటింగ్ యార్డ్ వరకు ఉన్న శ్రీనివాస సేతు పనులను మార్చి 15వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు.
శ్రీనివాస సేతు పనులు ఇప్పటికే 89 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా మే 15వ తేదీ లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అదేవిధంగా పాదాచారులు నడిచేందుకు అనువుగా పేవ్ మెంట్ , కాలువలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. సుబ్బలక్ష్మి సర్కిల్ వద్ద పచ్చదనం పెంపొందించాలని, అవసరమైన చోట్ల పెయింటింగు, తదితర పనులపై ఈవో సమీక్షించారు. ఈ సమావేశంలో జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎఫ్ఎ అండ్ సీ ఏవో బాలాజీ, సిఇ నాగేశ్వరరావు, మున్సిపల్ ఎస్ఇ మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.