ఏయూ వైస్ చాన్సలర్(వీసీ) పీవీజీడీ ప్రసాదరెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఎన్నికల కమిషన్కు అందిన ఫిర్యాదులపై జిల్లా అధికార యంత్రాంగం జరిపిన విచారణ నివేదికను జిల్లా కలక్టర్ ఎ.మల్లికార్జున తక్షణం బహిర్గతం చేయాలని పబ్లిక్ ఫోరం రాష్ట్ర కో-ఆర్డినేటర్ కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్ చేశారు. ఫిర్యాదుని ఈ మేరకు ఈ మెయిల్ ద్వారా జిల్లా కలక్టర్కు వినతిపత్రం పంపామన్నారు. ఆర్టీఐ చట్టం సెక్షన్ 4(1) (సి) ప్రకారం ప్రజలపై ప్రభావం చూపించే నిర్ణయాలు ప్రకటించినపుడు వాటికి సంబంధించిన అన్ని వాస్తవాలను బయటపెట్టాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధికి మద్దతుగా విశాఖపట్నంలోని ఒక హోటల్లో ప్రైవేటు కళాశాలల యాజమాన్య ప్రతినిధులతో ఏయు వీసీ ఇటీవల సమావేశం కావడంపై అందిన ఫిర్యాదుల నేపధ్యంలో జరిగిన విచారణ నివేదికను గోప్యంగా ఉంచడం సిగ్గుచేటన్నారు.