అమర జీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగ మూర్తి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడు, మహనీయుడు అని సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, జె.సి మయూర్ అశోక్ , డి.ఆర్.ఓ గణపతి రావు తదితరులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం జె.సి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16 న జన్మించి 1952 డిసెంబరు 15న అమరులయ్యారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడని, ఆయన త్యాగం ఫలితంగా నే ఆంధ్ర రాష్ట్రం 1956 నవంబర్1 న ఏర్పడిందని అన్నారు. పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడన్నారు.
తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సర కాలంలో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడని అన్నారు. ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణ భూతుడైనవారని, మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడని కొనియాడారు. డి.ఆర్. ఓ గణపతి రావు మాట్లాడుతూ మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాల ద్వారా వారి జీవిత విశేషాల నుండి స్ఫూర్తి పొంది యువత సన్మార్గంలో దేశ భక్తితో మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి యశోధన రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.