తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా తాను పనిచేసిన నాలుగేళ్లలో ఎక్కువమంది సామాన్య భక్తులకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కల్పించేందుకు ఎల్1, ఎల్2, ఎల్3 టికెట్లు రద్దు చేయడం, సామాన్యులకు స్వామివారి తొలి దర్శనం కల్పించేందుకు విఐపి బ్రేక్ సమయాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాలు అత్యంత సంతృప్తినిచ్చాయని టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు వసతి, ఇతర సదుపాయాలు మెరుగుపరచడం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నామని, అయితే, ఈ రెండు నిర్ణయాలు మాత్రం ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. నాలుగేళ్లపాటు ఛైర్మన్గా పనిచేసే అదృష్టం ప్రసాదించిన శ్రీవేంకటేశ్వరస్వామివారికి, తనకు అవకాశం ఇచ్చిన వైఎస్.జగన్మోహన్రెడ్డికి, తన వెన్నంటి ఉన్న ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఇతర అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన ఛైర్మన్గా నియమితులైన భూమన కరుణాకర్రెడ్డి అనుభవం టీటీడీ అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన చెప్పారు. టీటీడీ ధర్మకర్తల మండలి చివరి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధికారులు ఛైర్మన్ నాలుగేళ్ల పదవీకాలంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.