పతనమైన బంతి..కాలువ పాలైన వందల కేజీల పూలు


Ens Balu
30
Kadiyapulanka
2023-08-25 15:28:01

నిలకడ లేని పూల ధరలతో రైతులు లబోదిబోమంటున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా బుధ గురువారాల్లో పూల ధరలకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం మార్కెట్లో పూలను కొనేవారు లేక కాలవలోను,చెత్తకుప్పల్లోనూ పారబోసిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అలాగని ఈ పువ్వులు పక్క ఊరు నుంచి లేదా పక్క మండలం నుంచి తీసుకొచ్చినవి కాదు. ఎక్కడో కర్నూలు,చిత్తూరు తదితర జిల్లాల నుంచి తూర్పుగోదావరి జిల్లా కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ కు తీసుకువచ్చి బేరాలు లేక పారబోయాల్సిన దయనీయ పరిస్థితి ఎదురైంది. కొనుగోలుదారులు అధికంగా ఉండడం వల్ల బుధ, గురువారాల్లో  కేజీ 40 నుంచి రూ.70 పలకడంతో ఈ బంతి పూలను టన్నుల కొలది కడియపులంక మార్కెట్ కు తీసుకొచ్చారు. సుదూర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన ఈ బంతి పువ్వుల ధరలు గురువారం, శుక్రవారం మధ్యాహ్నం నుంచి  తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం అయ్యేసరికి కొనేవారే లేకపోయారు. దీంతో ఆ పువ్వులకు మచ్చలు వచ్చి పాడైపోవడంతో ఇలా కాలువలో పారబోయవలసి వచ్చిందని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా నుంచి బంతిపూలను వ్యాన్లో కడియపులంక తీసుకొచ్చామని తీరా ఇక్కడ కొనే వారు లేకపోవడంతో కాలువలో పారిపోసినట్లు  నాగేశ్వర రెడ్డి అనే రైతు వాపోయారు. ఆయా జిల్లాల్లో  పూలను కోయించి వాహనంపై ఇక్కడగా తీసుకొచ్చినందుకు కోతకూలి,రవాణా ఇతర ఖర్చులు కేజీకి 25 రూపాయలు వరకూ  అవుతుందని అలా తీసుకొచ్చిన పువ్వులను ఇక్కడ పారబోయడం వల్ల చాలా నష్టం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.