రాత్రి నిరాశ్రయకేంద్రాల నిర్వహణ భేష్..


Ens Balu
45
Visakhapatnam
2023-11-20 15:55:11

మహావిశాఖ నగరంలో జివిఎంసి నిర్వహిస్తున్న నైట్షెల్టర్ల నిర్వహణను పరిశీలించిన ప్రైమ్ మినిస్టర్ అడిషనల్ సెక్రటరీ అతిష్ చంద్ర సంతృప్తిని వ్యక్తం చేసారు. శనివారం   మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన  జివిఎంసి నిర్వహిస్తున్న 8 నిరాశ్రయ కేంద్రాలలో టిఎస్ఆర్ కాంప్లెక్స్, భుపేష్ నగర్ లో నిర్వహిస్తున్న నిరాశ్రయ కేంద్రాలను ఎపియుఎఫ్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జివిఎంసి కమీషనర్ సిఎం.సాయికాంత్ వర్మతో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా నిరాశ్రయ కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడుతూ, నైట్ షెల్టర్ లో ఎంత మంది నిరాశ్రయులు వున్నారు? వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో భాగంగా భోజనం, మరుగుదొడ్ల నిర్వహణ, వసతి, విద్యుత్, త్రాగునీటి సరఫరా, డార్మిటరి, వినోదం కొరకు టేలివిజన్, సి.సి.టివి తదితర వివరాలను అడిగి తెలుసుకోవడం తో పాటు స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసారు.

        అనంతరం జివిఎంసి కమీషనర్ మాట్లాడుతూ, విశాఖనగరం లో 2012 లో నిరాశ్రయ కేంద్రాలను ప్రారంభించారని, ప్రస్తుతం 8 నిరాశ్రయ కేంద్రాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అన్ని కేంద్రాలలో మొత్తం  285 మంది మహిళలు, పురుషులు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. వీటి నిర్వహణకు ఏడాదికి జివిఎంసి సాధారణ నిధుల నుండి 52 లక్షల 12 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు కమీషనర్ ప్రైమ్ మినిస్టర్ అడిషనల్ సెక్రటరీకు వివరించారు. ఈ పరిశీలనలో జివిఎంసి అదనపు కమీషనర్ ఎస్.ఎస్.వర్మ, ప్రాజెక్ట్ డైరెక్టర్ (యుసిడి) పాపునాయుడు, డిపిఓ లక్ష్మి, నిర్వాహకులు ప్రగడ వాసు, తదితరులు పాల్గొన్నారు.