జనసేన విశాఖజిల్లా అధ్యక్షుడిగా వంశీక్రిష్ణ శ్రీనివాస్


Ens Balu
81
Visakhapatnam
2024-01-03 13:56:26

వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు జనసేనలో కీలక బాధ్యతలను అప్పగించారు అధినేత పవన్ కళ్యాణ్. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వంశీకృష్ణ యాదవ్‌ను నియమించారు. వంశీ నియామకాన్ని ఖరారు చేస్తూ జనసేన అధికారిక ప్రకటన చేసింది. ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు వంశీకృష్ణ. వైఎస్సార్సీపీలో పోటీ చేసే అవకాశాలు రావని తెలియడంతో వంశీకృష్ణ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. పవన్‌ సమక్షంలోనే జనసేనలో చేరారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని ఉందని.. అందుకే తాను వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరానని వంశీకృష్ణ యాదవ్‌ తెలిపారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయాల కోసం 60 ఎకరాల భూమి, 10 సైట్లు అమ్ముకున్నానని, తన రాజకీయ భవిష్యత్‌ నాశనం కావడానికి  ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కారణమని వంశీకృష్ణ తీవ్రంగా ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఉత్తరాంధ్రకు చెందిన వంశీకృష్ణ గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు. యువరాజ్యం తరఫున అప్పటి ప్రభుత్వం పవన్‌తో కలిసి పోరాటం చేశారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతోవైఎస్సార్సీపీలో చేరారు. విశాఖ నుంచి ఎమ్మెల్సీగా పని చేస్తున్న ఆయన.. జనసేనలో చేరడంతో తిరిగి పవన్‌తో కలిసి పని చేయనున్నారు. వంశీకృష్ణ జనసేనలో చేరడంపై పవన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి వంశీకృష్ణ కృషి చేస్తారని పవన్‌ భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే విశాఖజిల్లా అధ్యక్షుడిగా వంశీక్రిష్ణ శ్రీనివాస్ ని నియమించడం పట్ల జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.