భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయం, ఆలోచనలకు అనుగుణంగా ప్రతి పౌరుడూ, అధికారీ, ప్రజాప్రతినిధి, స్వచ్ఛంద సేవకులు అభివృద్ధి లక్ష్యాల దిశగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగస్వామ్యం కావాలని ఆర్ధిక వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ సోల్మన్ ఆరోక్యరాజ్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను రూపొందించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రయోజనాలు అందిస్తోందని పేర్కొన్నారు. విశాఖ వేదికగా సోమవారం ఆయన జివిఎంసి పరిధిలో జోన్-5 నందు 61వ వార్డులో మల్కాపురం నందు మరిడిమాంబ కళ్యాణ మండపం నందు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాల ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించారు. 2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన తప్పక నిలుస్తుందని, ప్రపంచంలో 5వ ఆర్ధిక వ్యవస్థగా వున్న మన భారత దేశం రాబోయే కాలంలో 3వ ఆర్ధిక వ్యవస్థ గా అభివృద్ధి చెందుతుందన్నారు.
రెండు కోట్ల మంది మహిళలకు లక్షాధికారులను చేయడమే సంకల్ప యాత్ర ద్యేయమన్నారు. మహిళలు, యువత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. కనీస అవసరాల కల్పన దిశగా ప్రతి ఒక్కరికి గృహాలను అందించి మౌలిక వసతులను కల్పించామన్నారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ యోజన, పీఎం ఆవాస్ యోజన, పీఎం పోషణ్ అభియాన్, దీనదయాల్ అంత్యోదయ యోజన, పీఎం ఉజ్వల్ యోజన, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన, పీఎం భారతీయ జన్ ఔషధి పరియోజన తదితర పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమ, ఆర్థిక ఫలాలు అందాయని ఆయన గుర్తు చేసారు. భారత్ దేశం ఆర్ధిక వ్యవస్టగా పెంపొందించడానికి పరిశ్రమలు, ఆదాయ మార్గాలు పెరగాలని ఆ దిశగా గత మూడు సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చేసి కొన్ని వేల, లక్షల క్లిలోమీటర్ల రోడ్లు, రైల్వే లైన్లు, పోర్ట్లులు అభివృద్ధి కి కృషి జరుగుతుందన్నారు. ఇవన్ని తెలియ పరచటం కోసమే గత రెండు మాసాల నుండి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు విశాఖ నగరంలో జరుపుతున్నామన్నారు. ఆ దిశగా ప్రజలకు అందిస్తున్న 17 నుండి 20 రకాల ప్రయోజనాలు, సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ ఈ అవగాహన కార్యక్రమాలు జరుపుతూ సంబధిత స్టాళ్లను ఏర్పాటు చేయడమైనదన్నారు.
ఈ స్టాళ్లలో పధకాలు పొందని అర్హులైన లబ్దిదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లయితే, ఇక్కడ విచ్చేసిన అధికారులు వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు పధకాలను, ప్రయోజనాలను కల్పించే దిశగా చర్యలు చేపడతారన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి ప్రోత్సాహకాలను అందించే దిశగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ నిత్య సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు. అనంతరం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్ లను, విద్యార్ధులకు బహుమతులను అందించి కార్యక్రమానికి విచ్చేసిన వారితో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం బిజెపి స్టేట్ సెక్రటరీ సురేంద్ర మోహన్ మాట్లాడుతూ వికసించిన భారత్ దేశం కోసం అభివృద్ధి దిశగా సంకల్పం తీసుకోవాలని, ఇప్పటికే 11 కోట్ల మందికి ఉజ్వల పధకం క్రింద 7 వేల రూపాయల విలువ చేసే ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించామన్నారు.
అనంతరం జివిఎంసి అదనపు కమీషనర్ ఎస్.ఎస్.వర్మ మాట్లాడుతూ 2047 నాటికి అభివృద్ధి చెందినా దేశంగా సంకల్పమే వికసిత భారత్ యాత్రను ప్రధాన మంత్రి ప్రారంభించారన్నారు. విశాఖ నగరం లో 60 రోజుల నుండి ఈ సంకల్ప యాత్ర కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. సంకల్ప యాత్రలో కల్పిస్తున్న వివిధ పధకాలు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లల్లో పేర్లను నమోదు చేసుకొని సంక్షేమ పధకాలను పొందాలని అన్నారు. ప్రజలందరి ఆరోగ్య పరిరక్షణకు విశాఖ నగరాన్ని పర్యావరణ హిత నగరంగా అభివృద్ధి చేసేందుకు ఎకో వైజాగ్ కార్యక్రమాన్ని సహకారం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ ఆర్.జి.వి.క్రిష్ణ, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మలేరియా అండ్ హెల్త్ ఆఫీసర్ డి.జగదీశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.