మళ్లీ విజయనగరమే ఫస్ట్..
Ens Balu
2
Vizianagaram
2020-10-01 19:33:15
రాష్ట్రంలోనే ఫించన్ల పంపిణీలో విజయనగరం జిల్లా తన రికార్డును మరోసారి నిలబెట్టుకుంది. మొదటి తేదీనే 95.10 శాతం పింఛన్లను పంపిణీ చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలిచింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా, డిఆర్డిఏ పిడి పర్యవేక్షణలో గురువారం తెల్లవారుజాము నుంచే జిల్లా వ్యాప్తంగా వాలంటీర్లు రంగంలోకి దిగి ఫించన్లు పంపిణీని ప్రారంభించారు. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటికీ వెల్లి పించన్లను అందజేశారు. ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్లిపోయినవారికి, పొలంలోకి వెళ్లి మరీ వాలంటీర్లు పింఛన్ అందించారు. దత్తిరాజేరు మండలం వంగరలో ఇలా జరిగింది. అలాగే నడవలేని వృద్దులు, వికలాంగులకు వారి మంచాలవద్దకు వెళ్లి పింఛన్ను ఇచ్చారు. ఎప్పటిలాగే ఉదయం 6 గంటలకే పింఛన్ పంపిణీని మొదలు పెట్టడంతో, ఉదయం 7 గంటలకు 31.07శాతం, 8:30 కల్లా 38.76 శాతం, 9:00 గంటలకు 41.23 శాతం అలాగే సాయంత్రం 4:00 అయ్యేసరికి 92.19 శాతం పింఛన్లు పంపిణీ జరిగింది. దాదాపు అన్ని వేళల్లోనూ మన జిల్లా పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తూ వచ్చింది. చివరకు సాయంత్రం 6 గంటలకు 95.10 శాతం పింఛన్లను పంపిణీ చేసి తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. .జిల్లాలో మొత్తం 3,36,697 పింఛన్లు విడుదల కాగా, 3,20,197 పింఛన్ల పంపిణీ జరిగింది. ఉదయం నుంచి ఎంతో అంకితభావాన్ని ప్రదర్శించి జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీని తొలిరోజే దాదాపు పూర్తి చేసిన సిబ్బందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్, డిఆర్డిఏ పిడి కె.సుబ్బారావు అభినందించారు.