డంపర్ బిన్ లో చెత్త వేస్తే భారీ ఫైన్లు విధించండి..


Ens Balu
3
జివిఎంసీ కార్యాలయం
2020-10-27 18:12:52

విశాఖ మహానగరాన్ని డస్ట్ బిన్‌ ఫ్రీ సిటిగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి. సృజన కోరారు. మంగళవారం ఎఎంహెచ్‌వో, శానిటరి సూపర్‌వైజర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో ప్రజారోగ్య సిబ్బందితో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి వార్డు నుంచి ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల లోపు తప్పనిసరిగా డంపర్‌బిన్లును ఖాళీ చేయాలని, నిత్యం డంపర్‌బిన్లులో చెత్తను వేసేవారిని గుర్తించి వారికి జరిమానాలు విధించాలన్నారు. ప్రతి వార్డులో చెత్త సేకరణ చేసే ఆయా వాహనాల సమయంలో ఖచ్చితంగా బ్లూ, గ్రీన్‌, రెడ్‌ రంగుల బిన్లు ఉంచాలని, అలాగే వార్డులోని ప్రజలకు వీటిపై అవగాహన కల్పించాలన్నారు. నగరంలోని దుకాణాల వద్ద తప్పనిసరిగా డస్ట్ బిన్‌లు ఉంచాలని, వాటిని ఏర్పాటు చేయనివారిపై జరిమానాలు విధించాలన్నారు. ప్లాస్టిక్‌ నివారణకు శానిటరీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది కలసి దుకాణాలను తనిఖీ చేసి అమ్మకాలు చేసినట్లు గుర్తిస్తే వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. అలాగే నగరంలోని పలు హోటల్స్‌ సిబ్బంది నిత్యం వారి చెత్తను డంపర్‌బిన్లులలో వేస్తున్నారని, దీనిలో భాగంగా గెట్‌వే హోటల్‌ వారు వేస్తున్నట్లు గుర్తించామని, దీనికి రూ.25వేల రూపాయాలు జరిమానా విధించాలని సిఎంహెచ్‌వోను ఆదేశించారు. అంతేకాకుండా శానిటరి, సచివాలయ సిబ్బందితో పాటు, మెకానికల్‌ సిబ్బంది కూడా ప్రతిరోజు శానిటేషన్‌ పనులు, చెత్త తరలించే వాహనాలకు సంబంధించిన పనులపై దృష్టిసారించాలన్నారు. డంపర్‌బిన్లు నుంచి డంపిగ్‌యార్డ్ కు చెత్తను తరలించే వాహనాలకు ఖచ్చితంగా పై కవర్‌ కప్పి ఉంచాలని, లేనిట్లు కనిపిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా గాజువాక, పెందుర్తి, మధురవాడ ప్రాంతాల్లో పందుల బెడద ఉందని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వార్డుల్లో యూజీడి సర్వే పూర్తి చేయాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. ప్రజల్లో  పూర్తి అవగాహన కల్పించాలన్నారు. మీడియన్లు, గ్రీన్‌బెల్ట్‌ ప్రాంతాల్లో చెత్త, చెదారాలు లేకుండా చూడాలన్నారు. అలాగే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం లేకుండా చూడాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో ప్రధమ స్థానమే లక్ష్యంగా పనిచేయాలని, ఓడబ్ల్యూఎంఎస్ స్కానింగు గేట్స్ తక్కువుగా ఉన్న 10 వార్డులను గుర్తించి ఆయా వార్డు శానిటరీ ఇన్స్పెక్టరులకు వివరణ కోరారు. మరల రిపీటు అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.  సి.ఎమ్.ఓ.హెచ్. డాక్టర్‌ కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి మాట్లాడుతూ జాబ్ చార్టు ప్రకారం ఉదయం 6గంటల నుండే శానిటరీ కార్యదర్శులు విధులలో ఉండాలని, డైరీలో ప్రతీ రోజూ చేసిన పని వివరాలు ఉండాలన్నారు. శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టరులు, వార్డు శానిటరీ కార్యదర్శులు, ఒక టీంగా కూర్చొని మైక్రో పోకెట్స్ వైజ్ పని వివరాలు చర్చించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి. సన్యాసిరావు, సిఎంహెచ్‌వో డాక్టర్‌ కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఎఎంహెచ్‌వోలు జయరాం, లక్ష్మీతులసి, రాజేష్‌, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.