వాహదారులూ 26న సమ్మెను విజయవం చేయండి..


Ens Balu
3
సిఐటియు కార్యాలయం
2020-11-10 16:09:55

వాహనదారులపై భారీగా జరిమానాలు విధించే జివో నెంబరు 21ను తక్షణమే రద్దుచేయాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి యమ.జగ్గు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. జిఓ నెంబరు 21 రద్దుకై నవంబర్ 26న సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం జగదాంబలోని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, డ్రైవింగ్‌ లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌, వాహనాల కొనుగోలు, బదిలీ, ఫైనాన్స్‌ ఎండార్స్‌మెంట్‌ చలానా రేట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచి భారాలు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చివరికి థర్డ్‌పార్టీ ఇన్సూరెన్సు రేట్లు, టోల్‌గేట్ల జరిమానాలను సైతం వదల్లేదని ఎద్దేవాచేశారు. ఇప్పటికే కరోనా వల్ల 8 నెలల నుండి రవాణారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదురుకుంటున్న నేపధ్యంలో ఆటో, క్యాబ్స్‌, లారీ, వ్యాన్‌, బస్‌, తదితర ట్రాన్స్‌పోర్టు కార్మికులు పెద్ద ఎత్తున ఆర్ధికంగా చితికిపోయారని తెలిపారు. విపత్తు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఆర్ధికంగా ఆదుకోవాల్సింది పోయి భారాలు మోపడం సరైనది కాదని విమర్శించారు. ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10000 చొప్పున వాహనమిత్ర పథకం ద్వారా ఆదుకుంటోందనే సంతోషాన్ని కూడా ఎంతోకాలం మిగిల్చకుండా జరిమానాలు పేర లాక్కోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం వాహనదారులకు తలకుమించిన భారంగా ఉందన్నారు. కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతున్నా ఆదాయాలు మాత్రం పెరగడం లేదన్నారు. మరోవైపున కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికచట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చడం, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వంటి చర్యలకు పూనుకుందన్నారు. మోడీ, జగన్మోహన్‌రెడ్డిలు అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా మోటార్ కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు  కుమార్, కార్యదర్శి బి.జగన్‌, ఆటో కార్మిక సంఘం నగర ప్రధాన కార్యదర్శి డి.అప్పలరాజు, అధ్యక్షులు పి.రాజ్‌కుమార్‌, గౌరవాధ్యక్షులు కె.సత్యన్నారాయణ, మోటార్ ట్రాన్స్పోర్ట్ జిల్లా కార్యదర్శి జి.అప్పలరాజు పాల్గొని మాట్లాడారు. క్యాబ్‌ యూనియన్‌ అధ్యక్షులు శ్రీరారాములు, ఎపిఎస్‌ ఆర్టీసి హైర్‌బస్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.జె.రావు, శివ, ఎర్రినాయుడు, తాతబ్బాయి, వై.దేముడుబాబు, కే.వి.రమణ, బి.శ్రీనివాస్‌ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శిలు  పాల్గొన్నారు.