భావనపాడు పోర్టు భూములు పరిశీలన..
Ens Balu
2
సంతబొమ్మాలి
2020-11-11 17:55:28
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని భావనపాడు పోర్టు నిర్మాణానికి ప్రతిపాదిత ప్రాంత భూములను రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోర్టు నిర్మాణానికి సేకరించిన ప్రభుత్వ భూమి, సాల్ట్ ల్యాండ్ , జిరాయితీ భూములు ఎంత వరకు ఉన్నవి అనే విషయాలను జిల్లా సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. పోర్టు నిర్మాణం జరిగితే భూసేకరణ, తరలించవలసిన గ్రామాల వివరాలు, మత్స్యకారుల జీవన స్థితిగతులు, ప్రస్తుత జనాభా, తదితర విషయాలపై ఆరా తీశారు. మత్స్యకారుల జీవనానికి ఆధారమైన మత్స్య సంపద ఎంతవరకు లభిస్తుంది, వారు ఎంత మేరకు పెట్టుబడి పెడుతున్నది, ఎగుమతి, దిగుమతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. పోర్టు నిర్మాణం వలన ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో పోర్టు సీఈవో శ్రీనివాస్ రెడ్డి, పోర్టు డైరెక్టర్ ఆదినారాయణ, సబ్ కలెక్టర్ గనోర్ సూరజ్ ధనుంజయ, తాసిల్దార్ రాంబాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.