సిక్కోలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు..
Ens Balu
4
Srikakulam
2020-11-13 18:09:06
శ్రీకాకుళంజిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ జె నివాస్ దీపావళ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లా ప్రజలు అందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. దీపాల పండుగ దీపావళి సరికొత్త కాంతులను ప్రసరించి చీకటిని పారద్రోలి సరికొత్త కాంతుల జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. దీపావళి వెలుగులలో కరోనా వైరస్ రక్కసి పూర్తిగా నశించి జిల్లాలో నూతన అధ్యయనం ప్రారంభం కావాలని కలెక్టర్ ఆశించారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్కే రక్షణ కవచం అని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని కోరారు. జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు పెద్ద ఎత్తున సహకరించారని, వచ్చే మూడు నెలల కాలంపాటు అదే సహకారం కొనసాగించి కరోనా రహిత జిల్లాగా చేయుటకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని శుభ్రపరచుకోవడం అనే మూడు ప్రాథమిక సూత్రాలను పాటిద్దామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించామని – విద్యార్ధులు ఉన్నతంగా ఆలోచించి వైరస్ వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యక్తిగత అనారోగ్యానికి గురికావద్దని, అదే సమయంలో కుటుంబంలో ఉన్న అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, తాత, అమ్మమ్మ, నాన్నమ్మలకు కరోనా సోకకుండా ఆలోచించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుందాం ... దీపావళి కాంతుల్లో కరోనాను మట్టికరిపిద్దాం .... సరి కొత్త అధ్యయనానికి నాంది పలుకుదాం ... అని కలెక్టర్ పిలుపునిచ్చారు.