పోటీ పరీక్షలతో మంచి భవిష్యత్తు..


Ens Balu
6
Srikakulam
2020-11-19 14:37:22

పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి భవిష్యత్తును పొందాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.  గురువారం   ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో  పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిగ్రీ అనంతరం పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని యువతకు పిలుపునిచ్చారు.  ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, గ్రూప్ 1, 2 వంటి పోటీ పరీక్షలకు కాంపిటీటివ్ పుస్తకాలు దోహద పడతాయని తెలిపారు.  కళాశాలలో శని, ఆదివారాలలో మూడు  గంటల పాటు పోటీ పరీక్షలకు  కోచింగ్  ఇవ్వాలని తెలిపారు.  ఇది ఒక బేసిక్ ప్రిపరేషన్ గా వుపయోగపడుతుందని చెప్పారు.  లైబ్రరీ పుస్తకాలను చదువుకుని మరింత విజ్ఞానాన్ని పెంచుకోవాలని తెలిపారు.  కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరు అయిన వారంతా సెక్రటేరియట్ పోస్టులకు సెలక్టయినవారే నని తెలిపారు.  ఆర్ధిక స్వావలంబతో  చదువుకు సార్థకత చేకూరుతుందన్నారు.  మహిళలకు నిబధ్ధత, క్రమశిక్షణ వుంటాయని, కరోనా నేపథ్యంలో వైద్య సేవలందించిన వారు 70 శాతం మహిళలేనని తెలిపారు.  అమ్మాయిలు ఏదో ఒక రంగంలో ఉద్యోగం చేయాలన్నారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి అవకాశాలు వున్నాయని తెలిపారు. జిల్లాకు అనేక ప్రత్యేకలు వున్నాయని, ఒక యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించాలని సూచించారు. జిల్లాకు సంబంధించిన యూ ట్యూబ్ ఛానల్ నిర్వహించడానికి  ఎవరైనా ముందుకు వస్తే వారికి కావలసిన సలహాలను ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు.  కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరాములు మాట్లాడుతూ, ఈ రోజు జాతీయ సమైక్యతా దినోత్సవమని, ఝాన్సీ లక్ష్మీభాయ్, ఇందిరా గాంధీల జన్మదినం గుర్తు చేసారు. కాళాశాలలో కెరీర్ గైడెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.   యువజన సర్వీసులు శాఖ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, యువజన సర్వీసుల శాఖ ద్వారా ప్రతిరోజు ఉదయం 6 నుండి 7.30 నిమిషముల వరకు ఆన్లైన్ ఉచిత యోగ క్లాసులు మరియు ప్రతి మంగళవారం ప్రతి గురువారం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు మరియు ప్రతి శనివారము పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించబడుచున్నది, దీనికి సంబంధించి న జూమ్ లింక్  https://www.youtube.com/APYouthServices/live అని తెలిపారు. యువజన సర్వీసులు మరియు ఉపాధి కల్పన శాఖలు అందించిన  కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పరీక్షల పుస్తకాలను  జిల్లా కలెక్టర్ అందచేసారు. చలి కాలంలో మరింత అప్రమత్తతతో వుండాలని , కరోనా నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.  ప్రస్తుతం కోవిడ్ సెకెండ్ వేవ్ వున్నదని,   చలి కాలంలో వైరస్ త్వరితగతిన ప్రబలుతుందని, కావున మరింత అప్రమత్తతతో వుండాలని తెలిపారు.  మాస్కులు ధరించడం, సానిటైజర్ ఉపయోగించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి చర్యలను పాటించాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వై.సీతాలక్ష్మి, ఛీఫ్ కోచ్ శ్రీనివాస్ కుమార్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, లెక్చరర్లు సి.హెచ్.కృష్ణారావు, డా.మురళీమోహన్ విద్యార్ధినులు, తదితరులు పాల్గొన్నారు.