గిరిజనుల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం..
Ens Balu
3
Vizianagaram
2020-11-20 12:37:26
గిరిజనులను సీజనల్ వ్యాధుల నుంచి రక్షించడానికే దోమతెరలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 2.76 లక్షల గిరిజన కుటుంబాలకు దోమతెరలను అందిస్తున్నామని వెల్లడించారు. గిరిజనుల్లో దోమతెరల వినియోగంపై అధికారులు అవగాహన పెంచి చైతన్యం కలిగించే కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. జియ్యమ్మవలస మండలం చిన్నమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో డిప్యుటీ సిఎం శుక్రవారం గిరిజన కుటుంబాలకు దోమతెరలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, గాలిలో తేమ అధికంగా ఉండే వానాకాలం, శీతాకాలాల్లో పెరిగే దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా లాంటి ప్రాణాంతకమైన సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ వ్యాధుల బారినపడి అనేక మంది గిరిజనులు ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంటుందన్నారు. ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవడానికి దోమతెరలు ఉపయోగపడతాయని చెప్పారు. దోమతెరలను ఉపయోగించడం వల్ల దోమల కాటు నుంచి కాపాడుకోచ్చునని, దాంతో వ్యాధుల బారినపడే అవకాశం కూడా తగ్గిపోతుందని వివరించారు. అయితే ప్రతి ఏటా గిరిజనులకు దోమతెరలను పంపిణీ చేస్తున్నా కొంత మందికి వాటి వినియోగంపై అవగాహన లేకపోవడంతో వాడకుండా బీరువాల్లో మూసిపెట్టుకుంటున్నారని, ఈ కారణంగానే అనేక కుటుంబాలు వ్యాధుల బారిన పడటం గిరిజన ప్రాంతాల్లో చాలా చోట్ల జరుగుతోందని తెలిపారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న 2 లక్షల 70 వేల గిరిజన కుటుంబాలకు దోమతెరలను అందిస్తున్నామని చెప్పారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న4 సబ్ ప్లాన్ మండలాల పరిధిలో ఉన్న గిరిజన కుటుంబాలకు 1 లక్ష దోమతెరలను పంపిణీ చేస్తున్నామని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. గిరిజనుల్లో దోమతెరల వినియోగంపై అవగాహన లేకపోవడంతో పాటుగా దోమల మందు విషయంలోనూ అపోహలు ఉన్నాయని, ఈ కారణంగా కొన్ని చోట్ల దోమల నివారణకు ఉపయోగించే మందులను స్ప్రే చేయడాన్ని కూడా అడ్డుకుంటున్నారని వాపోయారు. ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దోమతెరల వినియోగం, దోమల మందు పిచికారీ విషయంలో గిరిజనుల్లో అవగాహన పెంచి వారిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా వినూత్నమైన రీతిలో కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గిరిజన కుటుంబాలు తమకు అందించిన దోమతెరలను బీరువాలో దాచిపెట్టకుండా, సద్వినియోగం చేసుకోవాలని తద్వారా సీజనల్ వ్యాధుల బారి నుంచి తమను తాము కాపాడుకోవాలని పుష్ప శ్రీవాణి హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి తులసి, డిప్యుటీ డీఎం అండ్ హెచ్ఓ రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.