మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు..
Ens Balu
2
Vizianagaram
2020-11-21 17:20:14
మత్స్యకారులు వారి మత్స్య సంపదను మార్కెటింగ్ చేసుకోవడానికి రాష్ట్రం లోనే తొలిసారిగా రిజిస్ట్రేషన్ చేసిన మార్కెటింగ్ సొసైటీ పత్రాలను మత్స్యకార సంఘాలకు జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ అందజేసారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నాలుగు ఫిషింగ్ హార్బర్ లకు, 25 ఆక్వా హబ్ లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపనలు చేసారు. ఈ కార్యక్రమం లో విజయనగరం నుండి జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్, శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, సంయక్త కలెక్టర్లు జి.సి కిషోర్ కుమార్, జే, వెంకట రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆక్వా బజార్ కు సంబంధించిన మత్స్యకార మార్కెటింగ్ సొసైటీ రిజిస్ట్రేషన్ పత్రం తో పాటు బైలా ను సంఘ సభ్యులకు అందజేసారు. ప్రతి జిల్లాకు ఒక ఆక్వా మార్కెటింగ్ సొసైటీ ని ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు మార్కెటింగ్ సౌకర్యం , గిట్టుబాటు ధరలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున, రాష్ట్రం లోనే విజయనగరం తొలి సొసైటీ గా ఏర్పడిందని కలెక్టర్ తెలిపారు.. అనంతరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ జిల్లాలో గల స్వదేశి మత్స్యకారులకు, ఆక్వా రైతులకు, చేపల వ్యాపారం చేసుకునే వారికీ, మహిళా సహకార సంఘాల సభ్యులకు పెట్టుబడి కోసం బ్యాంకుల ద్వారా అతి తక్కువ వడ్డీ తో రుణం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 62 మంది మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేసారు. . వీరికి బ్యాంకుల ద్వారా మంజూరు జేసిన 13.5 లక్షల రూపాయల ఋణం కు సంబంధించిన పాస్ పుస్తకాలను అందజేసారు. జిల్లాలో ఇప్పటి వరకు 128 మందికి 19.95 లక్షల రూపాయలను కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలక్రింద మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు శాసన మండలి సభ్యులు,శాసన సభ్యులు, మత్స్య శాఖ ఉప సంచాలకులు నిర్మలా కుమారి, జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షులు బర్రి చిన్న అప్పన్న, మక్కువ ఆక్వా రైతుల మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు వై. గోపాల కృష్ణ, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.