ప్రక్రుతి వైపరీత్యాలపై వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలి..
Ens Balu
2
Visakhapatnam
2020-11-24 20:20:51
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొని భాదితులకు సహాయం చేసేందుకు యువ వాలంటీర్లకు శిక్షణ అందించాలని జాతీయ విపత్తుల నిర్వహణా సంస్థ (ఎన్ డి ఎం ఎ)జాయింట్ సెక్రటరీ జి. రమేష్ కుమార్ జిల్లాయంత్రాంగానికి సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం సమావేశమందిరంలో ఎ పి ఎస్ డి ఎం ఎ మరియు ఎన్ డి ఎం ఎ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ రమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుల నిర్వహణకు సంబందించి “ఆపద మిత్ర స్కీమ్” ఏర్పాటు చేసిందని, దీని పైలట్ ప్రాజెక్టు కింద మూడు దశలలో దేశ వ్యాప్తంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనికి సంబందించి యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తీర ప్రాంతాల రాష్ట్రాలకు తుఫానుల తాకిడి అధికంగా ఉంటున్న నేపద్యంలో తుఫాన్ లు మరియు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా సంభవించినప్పుడు ఆయా ప్రాంతాలలో ఆస్తి మరియు ప్రాణ నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం తదితరాలకు సంబందించి అన్నియూనివర్శిటీలు , కళాశాలలు, పాఠశాలల, ఎన్ ఎస్ ఎస్, ఎన్ సి సి, విద్యార్ధిని, విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. డిసెంబరు నెలలో సంబందిత శాఖల అధికారులు, సిబ్బందికి వర్కుషాప్ ను కోవిడ్ నిబందనలు పాటిస్తూ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ తుఫాన్ ల తాకిడి జిల్లాకు ఎక్కువగా ఉంటుందని గతంలో హూదూద్ తుఫాన్ వలన చాలా నష్టం సంభవించిందన్నారు. ఆ సమయంలో రెవెన్యూ యంత్రాంగం తో పాటు ఎన్ ఎస్ ఎస్, ఎన్ వై కె , కోస్ట్ గార్డు, ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ తదితర శాఖల సిబ్బంది తమ సేవలను అందించారన్నారు. ఈ సమావేశంలో ఎన్ డి ఎం ఎ జాయింట్ ఎడ్వవైజర్ నావల్ ప్రకాష్, ప్రాజెక్టు అసిస్టెంటు బ్రజేష్ జైశ్వాల్ , జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాలరెడ్డి, జిల్లారెవెన్యూ అధికారి ప్రసాద్, కోస్ట్ గార్డు డి ఐ జి బి.రంజన్, ఎన్ డి ఆర్ ఎఫ్ కమాండెంటు ఈశ్వరరావు , జిల్లా సహాయక అగ్నిమాపక శాఖ అధికారి సింహాచలం, ఇరిగేషన్ ఎస్ ఇ కె ఎస్ కుమార్, ఎన్ ఎస్ ఎస్, ఎన్ వై కె కో ఆర్డినేటర్లు హరినాద్, రామ్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.