‘షిప్‌యార్డు క్రేన్‌ ప్రమాదంపై రెండు కమిటీలు’..జిల్లా కలెక్టర్‌


Ens Balu
4
Visakhapatnam
2020-08-02 11:16:05

హిందూస్థాన్‌ షిప్‌ యార్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదన్నారు. క్రేన్‌ ఆపరేషన్‌, మేనేజ్‌మెంట్‌లో మొత్తం మూడు కాంట్రాక్ట్‌ సంస్థలు ఉన్నాయని చెప్పారు. మృతుల్లో నలుగురు హెచ్‌ఎస్‌ఎల్‌ ఉద్యోగులు కాగా.. మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు చెందినవారని పేర్కొన్నారు. క్రేన్‌ కుప్పకూలిన సమయంలో కేబిన్‌లో 10 మంది ఉన్నారని తెలిపారు. కేబిన్‌లో ఉన్న పదిమందితోపాటు మరొకరు మృతి చెందారని వివరించారు. మృతుల్లో 10మంది వివరాలను గుర్తించామని, మరొక మృతుడి వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద కారణాల కోసం కమిటీ ఏర్పాటుకు హెచ్‌ఎస్‌ఎల్‌ ఛైర్మన్‌ను కోరామన్నారు. హెచ్‌ఎస్ఎల్‌ ప్రమాదంపై రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏయూ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులతో కమిటీ, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి కమిటీ వేస్తామని కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు.