10న ఏయూ పూర్వవిద్యార్థుల వార్షిక సమ్మేళనం
Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-08 17:53:43
ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమ్మేళనం వేవ్స్ 2020ని డిసెంబర్ 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తెలిపారు. మంగళవారం ఏయూ సెనేట్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గురువారం సాయంత్రం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు వర్చువల్ విధానంలో ఈ సమ్మేళనం జరుగుతుందన్నారు. ముఖ్యఅతిధిగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పాల్గొంటారన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి, ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం వ్యవస్థాపక అద్యక్షులు గ్రంధి మల్లికార్జున రావు(జిఎంఆర్) తదితరులు పాల్గొంటారన్నారు. వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 10న ఈ సమ్మేళనం ప్రతీ సంవత్సరం నిర్వహించడం జరుగుతోందన్నారు. మద్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు పూర్వవిద్యార్థుల సమ్మేళనం, సాయంత్రం 4 నుంచి 4.30 వరకు ప్రధాన సమావేశం జరుగుతాయన్నారు. సమ్మేళనాన్ని డిజిటల్ విదానంలో జూమ్, యూ ట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. కోవిడ్ నేపధ్యంలో ఈ సమ్మేళనాన్ని వర్చువల్ విధానంలో ఏర్పాటుచేసామన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి పూర్వవిద్యార్థులు సంపదగా నిలుస్తున్నారని, వీరిని వర్సిటీకి విలువైన మానవ వనరులుగా నిలుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను లాభదాయకంగా మార్పుచేసుకుంటూ వర్చువల్ విధానంలో ఉన్నత స్థానాలలో స్థిరపడిన పూర్వవిద్యార్థుల అనుభవ జ్ఞాన సారాన్ని నేటి తరానికి అందించే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం కార్యదర్శి బి.మోహన వెంకట రామ్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.