28న శ్రీకాకుళంలో తపాలా అదాలత్..


Ens Balu
4
Srikakulam
2020-12-14 22:28:03

 తపాలా శాఖకు చెందిన వ్యక్తిగత ఫిర్యాదులు, వినియోగదారుల సమస్యలను పరిష్కరించుటకు ఈ నెల 28న తపాలా అదాలత్ ను నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్  వై.యస్. నర్సింగ రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. విశాఖపట్నం పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా వినియోగదారుల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 28న ఉదయం 11.00గం.లకు విశాఖపట్నం యం.వి.పి.బస్ స్టేషన్ ప్రక్కన గల పోస్ట్ మాస్టర్ జనరల్ వారి కార్యాలయంలో పోస్ట్ మాస్టర్ జనరల్ వారిచే  ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పారు. ఇది 101వ తపాలా అదాలత్ అని, తపాలా సర్వీసులకు చెందిన ప్రత్యేక, వ్యక్తిగత ఫిర్యాదులు మాత్రమే ఈ అదాలత్ నందు స్వీకరించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఫిర్యాదులు, సమస్యలు తెలియజేయు వినియోగదారులు 101వ తపాలా అదాలత్ అనే శీర్షికతో పి.ఆనందరావు, అసిస్టెంట్ డైరక్టర్, పోస్ట్ మాస్టర్ జనరల్ వారి కార్యాలయం, విశాఖపట్నం – 530 017 చిరునామాకు డిసెంబర్ 17లోగా  పంపాలని, గడువు తేదీ ముగిసిన తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.