నేల స్వభావానికి అనుగుణంగా నిర్మాణాలు..
Ens Balu
4
Visakhapatnam
2020-12-17 20:39:02
భారీ నిర్మాణాల సమయంలో నేల స్వభావాన్ని అధ్యయనం చేసి తదనుగుణంగా నిర్మాణాల ప్రణాళిక తీర్చిదిద్దాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురువారం ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం, ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ విశాఖ ప్రాంతీయ కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ సదస్సు ‘ఇండియన్ జియోటెక్నికల్ కాన్ఫరెన్స్ 2020’ని ఆయన ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నేల స్వభావాన్ని అధ్యయనం చేసి నిర్మాణం చేపట్టడం వలన అనవసర వ్యయం, వృధాను నివారించడం సాధ్యపడుతుందన్నారు. సిమెంట్ గ్రౌటింగ్ చేసి ఏయూలో చేపట్టిన నిర్మాణం, దీని ద్వారా వనరులను, నిధులను, సమయాన్ని ఆదా చేసిన విధానాన్ని వీసీ ప్రసాద రెడ్డి ఉదహరించారు.
జియో టెక్నికల్ సొసైటీ ప్రాంతీయ కేంద్రం చైర్మన్ ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి సదస్సు కన్వీనర్గా వ్యవహరిస్తూ సదస్సుకు ప్రతినిధులను ఆహ్వానం పలికారు. సదస్సులో 26 ప్రత్యేక ప్రసంగాలు ఏర్పాటు చేసారన్నారు. 327 పరిశోధన పత్రాలను, 14 టెక్నికల్ సెషన్స్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సుకు ఆన్లైన్లో 600 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ సాయిల్ మెకానిక్స్ అండ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్(ఐఎస్ఎస్ఎంజిఇ) అద్యక్షుడు ఆచార్య చార్లెస్ ఎన్జి సదస్సు ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఐఎస్ఎస్ఎంజిఇ ఉపాద్యక్షుడు(ఆసియా) ఆచార్య ఇ.సి షిన్, ఐఎస్జి అద్యక్షుడు ఆచార్య జి.ఎల్ శివ కుమార్ బాబు తదితరులు సదస్సు సావనీర్, సాంకేతిక సంచికలను విడుదల చేశారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య టి.వి ప్రవీణ్ విభాగ ప్రత్యేకతను, పరిశోధనల ప్రగతిని వివరించారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య పి.వి.వి సత్యనారాయణ వందన సమర్పణ చేశారు.
ఐఐటి గౌహతి సంచాలకులు ఆచ్యా టి.జి సీతారాం 42వ ఐజిఎస్ వార్సిక ప్రసంగాన్ని ‘ ది క్విటిసెన్స్ ఆఫ్ 25 ఇయర్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అంశంపై ప్రసంగించారు. హాంకాంగ్ వర్సిటీ ఆచార్యులు ఆచార్య చార్లెస్, సౌత్ కొరియా ఇంచియాన్ వర్సిటీ ఆచార్యులు ఇ.సి షిన్, ఐఐఎస్సి బెంగళూరు ఆచార్యులు జి.ఎస్ శివ కుమార్ బాబు, యుకెలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఆచార్యులు ఆచార్య గోపాల్ మాడభూషి, ఐఐటి ముంబాయి ఆచార్యులు దీపాంకర్ చౌదురిలు కీలకోపన్యాసాలను అందించారు.