ఆంగ్లభాష అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాం..
Ens Balu
5
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-17 21:07:24
ఆంగ్ల భాష అభ్యసనాన్ని అమెరికాదేశం ప్రోత్సహిస్తుందని అమెరికన్ కాన్సులేట్ జనరల్(హైదరాబాద్) పబ్లిక్ అఫైర్స్ అధికారి డేవిడ్ డబ్య్లూ మోయర్ అన్నారు. గురువారం ఏయూను సందర్శించిన ఆయన వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డేవిడ్ మోయర్ మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయంతో విద్య, పరిశోధన సంబంధ భాగస్వామ్యం తాము కోరుకుంటున్నామన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన హర్షదాయకమన్నారు. మహిళా విద్యకు ఆంధ్రవిశ్వవిద్యాలయం అందిస్తున్న ప్రాధాన్యం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా వర్సిటీ పరిపాలనా పదవుల్లో సైతం మహిళా భాగస్వామ్యాన్ని స్వాగతించారు. అనంతరం వర్సిటీలో వివిధ విభాగాలలో జరుగుతున్న పరిశోధనలు, మౌళిక వసతులు, భాగస్వామ్యానికి అనువైన విధానాలను పరిశీలించారు.
ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డిఅంతర్జాతీయ విద్యా సంస్థల భాగస్వామ్యాన్ని ఆంధప్రదేశ్లో కోరుకుంటున్నారన్నారు. దేశంలోని అత్యుత్తమ 10 విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఏయూ నిలవాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, దీనిని సాకారం చేసే దిశగా తాము కృషిచేస్తున్నామన్నారు. విశాఖలో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మశీ, డిగ్రీ కళాశాలల్లో లక్షలాది మంది విద్యను అభ్యశిస్తున్నారని వివరించారు. ఎడ్యుకేషన్, మెడికల్ హబ్గా ఇప్పటికే విశాఖపట్నం ఖ్యాతి గాంచిందని తెలిపారు.రాష్ట్రంలో ఐటి రంగానికి పరిశ్రమల ఏర్పాటుకు చిరునామాగా విశాఖ నగరం నిలుస్తోందన్నారు. ఈ రంగానికి అవసరమైన విలువైన మానవ వనరులను అందించే కేంద్రంగా ఏయూ ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పదవుల్లో 50 శాతం మహిళలకు కేటాయించడం జరిగిందన్నారు. పాఠశాల విద్యలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టిన ఘనత ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డికి దక్కుతుందన్నారు. జ్ఞానాన్ని ప్రసరింపచేస్తూ, నిపుణులను తీర్చిదిద్దే వేదికగా ఏయూ నిలుస్తోందని తెలిపారు.
ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ ఏయూ ప్రగతిని, ప్రత్యేకతలను వివరించారు. ఏయూలో ప్రత్యేకంగా ఐపిఆర్ చెయిర్ను ఏర్పాటు చేసామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను డేవిడ్ మోయర్కు తెలియజేశారు. ఈ పథకాల ఫలితంగా గ్రామీణ విద్యార్థులు సైతం నాణ్యమైన ఉన్నత విద్యను పొందడం సాధ్యపడుతోందని వివరించారు.
కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, ప్రిన్సిపాల్స్ ఆచార్య వై.రాజేంద్ర ప్రసాద్, పి.రాజేంద్ర కర్మార్కర్, ఎస్.సుమిత్ర, ఎస్.కె భట్టి, ఆచార్య భాస్కర రెడ్డి, ఆచార్య డి.వి.ఆర్ మూర్తి, ఆచార్య చల్లా రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా డేవిడ్ మోయర్ను ఏయూ వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి సత్కరించారు.