ఏపీసెట్ 2020కి 35,862 మంది అభ్యర్ధులు..
Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-18 23:07:53
రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపిసెట్ 2020ని ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఏపిసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాస రావు శుక్రవారం తెలిపారు. పరీక్ష హాల్ టికెట్లను వెబ్సైట్లో ఉంచామని, అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకుని తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలలో పరీక్షకు హాజరు కావాలని సూచించారు.ఏపిసెట్ ప్రవేశ పరీక్షకు 35,862 మంది దరఖాస్తు చేసారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 76 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసామని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు. పరీక్షను 30 సబ్జక్టులకు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు పేపర్ 1, ఉదయం 10.30 నుంచి 12.30 వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు నగరాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలలో నిర్వహిస్తారు. పూర్తి సమాచారం ఏపిసెట్ వెబ్సైట్ నుంచి పొందవచ్చునని తెలిపారు.
విద్యార్థులను పరీక్ష సమయానికి గంట ముందుగా పరీక్ష కేంద్రాల లోనికి అనుమతిస్తామన్నారు. ప్రతీ విద్యార్థికి వారి వివరాలతో కూడిన ఓఎంఆర్ షీట్ను అందిస్తామని, దీనిలో వివరాలు సరిచూసుకోవాలన్నారు. సమాధానాలను నీలం, నలుపు బాల్ పాయింట్ పెన్తో గుర్తించాలన్నారు. పరీక్షల్లో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష కేంద్రాల లోనికి సెల్పోన్, కాలిక్యులేటర్లు అనుమతించరు. కోవిడ్ నియమావళిని అనుసరిస్తూ విద్యార్థులు మాస్కులు ధరించి, శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు.