చిత్తూరు జిల్లాలో 2,46,631 మంది లబ్ధిదారులు..
Ens Balu
2
Chittoor
2020-12-24 20:29:52
నిరుపేదల సొంతింటి కల నెరవేరే శుభ సమయం ఆసన్నమయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏ.పి. ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు కార్యక్రమం వారి సొంతింటి కలల్ని సాకారం చేయనున్నది. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పేరుతో రాష్ట్రంలోని ప్రతి అర్హులైన నిరుపేదకు ఇంటి స్థలంతోపాటు ఇళ్లు నిర్మించుకొనేందుకు అవసరమైన ఆర్ధిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త తెలిపారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబరు 25 శుక్రవారం జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, శాసనసభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించిన అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఈనెల 28న సి.ఎం. ప్రారంభిస్తారు.
జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టి అవసరమైన భూసేకరణ ఏర్పాట్లు చేయడం జరిగింది. వీరందరికీ ఇళ్లస్థలాలు మంజూరు చేసేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3760.37 ఎకరాలను సేకరించడం జరిగిందని, ఇందులో 1,903.90 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించగా, 1856.47 ఎకరాల డికెటి/పట్టా ల్యాండ్ సేకరించడం జరిగిందన్నారు. సేకరించిన భూముల్లో 1,267 లే అవుట్లు అభివృద్ధి చేసి లబ్దిదారులుగా గుర్తించిన వారందరికీ ఇళ్లస్థలాలు అందజేసేందుకు జిల్లా యంత్రాంగం గత ఏడాది కాలంగా అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ లే ఔట్ లలో రోడ్లు, కమ్యూనిటీ స్థలాలు తదితర అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. ఈ లేవుట్లలో మంజూరు చేసే ఇళ్ల పట్టాలన్నీ కుటుంబంలోని మహిళల పేరుతోనే అందించనున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తం గా 2,46,631 మంది లబ్ధి పొందనుండగా అందులో 1,41,775 ఇండ్ల పట్టాలు, 10,728 టిడ్కో ఇండ్లు మంజూరు జరుగుతుందని తెలిపారు.
ఇళ్ల స్థలాలను మంజూరు చేయడంతో పాటు ఆయా స్థలాల్లో లబ్దిదారులకు ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నారు. జిల్లాలో తొలివిడతగా 1,74,240 ఇళ్లు ఒక్కొక్కటి రూ.1.80 లక్షల వ్యయంతో మంజూరు చేస్తున్నట్టు జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ పద్మనాభం తెలిపారు. లబ్దిదారులు తామే సొంతంగా నిర్మించుకుంటే వారికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేస్తామని, లేదంటే ఇంటి నిర్మాణ సామాగ్రి రూపంలో ప్రభుత్వ సహాయం కోరుకుంటే ఆవిధంగా సామాగ్రి అందజేస్తామని, లేక ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లబ్దిదారులు కోరుకుంటే నిర్మించి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన లేఅవుట్లతో పాటు, సొంత ఇంటి స్థలాలు కలిగి వుండి తమ స్థలంలోనే ఇళ్లు నిర్మించుకొనే వారికి కూడా ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.
వీటితోపాటు గతంలోనే ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొన్న 94,128 మందికి పొసెషన్ సర్టిఫికేట్లు కూడా జారీ చేయనున్నారు. ఈ నెల 28 న శ్రీకాళహస్తి ఉరందూరులో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విచ్చేయనున్నారని కలెక్టర్ తెలిపారు.