ఏ ఒక్క లబ్దిదారుడు నష్టపోకూడదు..


Ens Balu
2
Srikakulam
2021-01-05 18:29:24

నిరుపేదలకు లబ్ది చేకూర్చాలని, అర్హులైన ఏ ఒక్క లబ్దిదారుడూ నష్టపోకూడదని  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  మంగళవారం జగనన్న కాలనీలు, ఉపాధిహామీ పనులు, అమ్మఒడి కార్యక్రమాలపై సీఎం  జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, హౌసింగ్, ఎడ్యుకేషన్, వ్యవసాయ శాఖాధికారులతో  సి.ఎం. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎం. మాట్లాడుతూ, నిరుపేదలకు ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, జనవరి 20 వ తేదీ నాటికి అర్హులందరికీ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంల పూర్తి చేయాలని చెప్పారు.  పెండింగ్ బిల్లులు అప్ లోడ్ చేయాలని తెలిపారు.  ప్రతీ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేయడం జరుగుతున్నదన్నారు.  సచివాలయాలలో ఏ ఏ పథకాలను ఎన్ని రోజులలో అందచేయడం జరుగుతుంది, అనే విషయాన్ని బోర్డులపై తెలియచేయాలన్నారు. నిక్కచ్చిగా లబ్దిదారుల జాబితాలను పరిశీలించాలన్నారు.  ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, నిరుపేదలకు మంచి ఇళ్ళను అందించి చరిత్రలో నిలచిపోవడం జరుగుతుందని  కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లకు తెలిపారు.  కోలనీలలోని  లే- ఔట్లలో మంచి రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, మంచి నీటి సరఫరా, వంటి మౌలిక సదుపాయాలను కలుగచేయాలని తెలిపారు.  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడం ద్వారా మంచి సౌకర్యవంతంగా వుంటుందన్నారు.  భవిష్యత్తరాలకు ఉపయోగ పడే విధంగా చెట్లను పెంచాలన్నారు.  సాంక్షన్ ప్రొసీడింగ్స్ ను లబ్దిదారులకు అందచేయాలని, యుధ్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయాలన్నారు.  ప్రతీ కాలనీలోను ఒక మోడల్ హౌస్ నిర్మించాలన్నారు. మ్యాపింగ్, జియో ట్యాగింగ్ చేయాలని తెలిపారు.    సెక్రటేరియట్ లో వున్న  ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని సి.ఎం. తెలిపారు.  సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనా లు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం,  బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్   ఉపాధిహామీ ద్వారా పూర్తి చేయాలన్నారు. ఆగష్టు కల్లా నిర్మాణాలు పూర్తి చేయాలని, మండలం ఒక యూనిట్ క్రింద మైక్రో లెవెల్ ప్లానింగ్ ద్వారా లక్ష్యాలను  సాధించాలని తెలిపారు.  నాడు నేడు  పనులను  ఫిబ్రవరి 20 నాటికి పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ భవనాలు ప్రి ప్రైమరీ స్కూల్స్ గా మార్పాలన్నారు. ప్రతీ గ్రామం లో జనతా బజారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండాలని,  మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ ఆర్ బి కే ల కు దగ్గరగా నిర్మించాలని అన్నారు.  జనవరి నెలాఖరు నాటికి భూసేకరణ చేసి అగ్రికల్చర్ శాఖకు అందచేయాలని తెలిపారు.  రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ ఏప్రిల్ నెలలో  అందచేయడం జరుగుతుందన్నారు.      జనవరి 11న అమ్మ ఒడి సొమ్మును  జమ చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారుల జాబితా సచివాలయాలలో ఇప్పటికే వుంచడం జరిగిందన్నారు.  ఫిబ్రవరి 1వ తేదీ నుండి నాణ్యమైన బియ్యం ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సి.ఎం.తెలిపారు. సదరు కార్యక్రమానికి రవాణా నిమిత్తం వాహనాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు.  ఈ నెల 20న వాహనాలను  ప్రారంభం చేస్తామని, జిల్లాలలో  కలెక్టర్లు, ప్రజా ప్రతి నిధులు ప్రారంభించాలని తెలిపారు. అనంతరం దేవాలయాలపై దాడులు శోచనీయమని, దేవాలయాల పరిరక్షణ కు 36 వేల సి సి కెమెరాలని అమర్చడం జరిగిందని తెలిపారు.                                ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. నివాస్,  జిల్లా పోలీసు సూపరెంటెండెంట్  అమిత్ బర్దర్, సంయుక్త కలెక్టర్లు  సుమీత్ కుమార్, కె.శ్రీనివాసులు, ఆర్. శ్రీరాములు  నాయుడు, హౌసింగ్ పి.డి. టి.వేణుగోపాల్, డి.ఇ.ఓ. కె.చంద్రకళ, ఎగ్రికల్చర్ జె.డి.  కె.శ్రీధర్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.