కోవిడ్ వేక్సినేషన్ తో ఆరోగ్య భద్రత..
Ens Balu
3
Srikakulam
2021-01-16 20:15:49
శ్రీకాకుళం జిల్లాలో మొదటి విడత కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం శనివారం ప్రారంభం అయింది. జిల్లాలో ఏర్పాటు చేసిన 18 వాక్సినేషన్ కేంద్రాల్లో కార్యక్రమం ప్రారంభం అయింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వాక్సినేషన్ కార్యక్రమంను లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆరోగ్య సిబ్బంది బి.ఉషారాణి మొదటి వాక్సిన్ డోస్ ను తీసుకున్నారు. వాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోడి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా ప్రదర్శించారు. ప్రధాని నరేంద్రమోడి మాట్లాడుతూ దేశంలో పెద్ద వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అవుతోందన్నారు. వాక్సినేషన్ తయారీ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు, వారి వైజ్ఞానిక దక్షతకు అభినందించారు. వాక్సినేషన్ కార్యక్రమం జరిగిన 30 రోజుల తరువాత కరోనా వైరస్ ను ఎదుర్కొనే సామర్ధ్యం శరీరానికి కలుగుతుందని పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచు కోవాలని పిలుపునిచ్చారు. దేశంలో మొదటి విడతలో 3 కోట్ల మందికి, రెండవ విడతలో 30 కోట్ల మందికి వాక్సినేషన్ జరుగుతుందని చెప్పారు. వాక్సిన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి గురజాడ అప్పారావు చెప్పిన దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే మాటలను గుర్తుచేశారు.
జిల్లాకు పూణే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ 2,650 కోవిడ్ వ్యాక్సిన్లు రాగా వాటిని 26,500 మందికి వేసేందుకు అవకాశం ఉంది. అయితే మొదట విడతలో ఆరోగ్య సిబ్బందికి మాత్రమే నిర్ధేశించిన సంగతి అందరికి విదితమే. ఇప్పటి వరకు 21,943 మంది ఆరోగ్య సిబ్బంది నమోదు అయ్యారు. మొదటి విడత వాక్సినేషన్ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలను మినహాయించారు. ప్రతి కోవిడ్ వాక్సినేషన్ కేంద్రం వద్ద వ్యాక్సినేషన్ చేయు బృందంలో మహిళ పోలీస్, డిజిటల్ అసిస్టెంట్, వాక్సినేషన్ అధికారి, అంగన్వాడికార్యకర్త, ఆషా కార్యకర్త సభ్యులుగా బృందాన్ని ఏర్పాటు చేసారు. ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రానికి ఒక వైద్యాధికారిని నిర్వహణాదికారిగా నియమించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ మాట్లాడుతూ కోవిడ్ నివారణకు వాక్సినేషన్ రావడం ముదావహమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడి, రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడికి మంచి చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. మొదటి విడతలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. మొదటి డోస్ అనంతరం 28 రోజులకు రెండవ డోస్ ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వాక్సినేషన్ మంచి కార్యక్రమం అని కరోనా మహమ్మారి నుండి రక్షణ కవచమని చెప్పారు.
రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ దేశం గర్వించదగిన రోజు అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ముందంజలో ఉందని చెప్పడానికి వాక్సిన్ తయారీ కార్యక్రమం గొప్ప ఉదాహరణ అన్నారు. కరోనా కట్టడికి దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందని, అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు, జిల్లా కలెక్టర్ జె నివాస్, వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, అదనపు ఎస్.పి పి.సోమశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణ మూర్తి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణ వేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్. భారతీ కుమారి దేవి, డిటిటి పి.ఓ డా.జె.కృష్ణమోహన్., మునిసిపల్ మాజీ చైర్మన్ ఎం.వి.పద్మావతి, రిమ్స్ హెచ్.డి.ఎస్ సభ్యులు వరుదు విజయ కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు నటుకుల మోహన్, దేవ భూషణ్ రావు., ప్రకాష్, రమేష్., వైద్యులు తదితరులు పాల్గొన్నారు.