కోవిడ్ 19 నియంత్రణలో విశాఖలో మంచిఫలితాలు..
Ens Balu
3
Visakhapatnam
2020-08-13 19:36:51
విశాఖపట్నం జిల్లాలో కోవిడ్-19 పై పోరులో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని, మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువ ఉండే విధంగా కృషిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. గురువారం నాడు డిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అధికారులతో కొవిడ్ వ్యాప్తి నివారణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ ఆయన టెస్టింగు ల్యాబ్ ల సామర్ద్యాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని, ఫలితాలు జాప్యం లేకుండా వెల్లడించాలని కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, ఇతర పారామెడికల్ సిబ్బంది కోవిడ్ బారిన పడే అవకాశాలను తగ్గించాలని తెలిపారు. వారికి ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తపడాలని, పి.పి.ఇ. కిట్ల వినియోగం, డిస్పోజల్ పై అవగాహన పెంచాలని, వారు హాట్ స్పాట్ ప్రాంతాలలో నివసిస్తుంటే మరింత శ్రద్ద వహించాలని తెలిపారు. గుర్తించిన పాజిటివ్ కేసులను సత్వరమే అంబులెన్స్ లద్వారా ఆసుపత్రులకు, కేర్ సెంటర్లకు తరలించాలని తెలిపారు. రోగులు ఆసుపత్రికి రాగానే త్వరగా బెడ్ కేటాయించి చికిత్స ప్రారంభించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ హోం ఐసోలేషన్ లో ఉండే పాజిటివ్ రోగుల వలన వారి కుటుంబాలకు కోవిడ్ సోకే ప్రమాదం ఉందని, వారిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పొరపాటున జాగ్రత్తలు పాటించకుండా బయట తిరిగితే ఇతరులకు వ్యాప్తి చెందుతుందని తెలిపారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా మారుమూల ప్రాంతాలలో కూడా కాంటాక్టు ట్రేసింగు ను సమర్దవంతంగా చేయగలుగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో అత్యదికంగా పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ఖాళీలను పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో బెడ్ల కేటాయింపును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్త్తున్నట్లు తెలిపారు. కొత్తగా 1088 అంబులెన్స్ లను ప్రారంభించినట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వస్తున్న విదేశీ ప్రయాణీకులను నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో ఉంచుతున్నట్లు తెలిపారు. విశాఖ నగరంలో కొత్తగా 42 పి.హెచ్.సి.లను ప్రారంభిస్తున్నట్లు, వీటికి సిబ్బందిని నియామకం చేస్తున్నట్లు తెలిపారు. 54 పాత అంబులెన్స్ లకు కూడా మరమ్మత్తులు చేయించి వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లారెవిన్యూ అధికారి ఎం. శ్రీదేవి, ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయకుమార్ పాల్గొన్నారు.