అవకాశాలు, మేధస్సుకు వేదిక భారత్..
Ens Balu
3
Visakhapatnam
2021-01-26 13:26:41
అపార మేధస్సుకు, అనంత అవకాశాలకు వేదికగా భారత దేశం నిలుస్తుందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోద్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, జాతీయ పతాకాన్ని ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ నూతన సమాజానికి అనుగుణంగా, అవసరమైన నైపుణ్యాలను అందించే విద్యను విద్యార్థులకు చేరువ చేసే దిశగా పనిచేస్తున్నామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, తీవ్రవాద రహితంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ముందుగా ఏయూలోని మహాత్మాగాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనకు విశేష కృషిచేసారన్నారు. ఎందరో పోరాటాలు, త్యాగాలు అనంతరం స్వాతంత్య్రం సాకారం అయిందన్నారు. రాజ్యాంగం సామాజిక మార్పుకు, సమానత్వానికి వారధిగా నిలచిందన్నారు. అనంతరం జాతీయ సేవా పథకం విద్యార్థులకు, పోగ్రాం అధికారులకు పురస్కారాలను ప్రధానం చేశారు. ఎన్సిసి, ఏయూ సెక్యూరిటీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల కవాతు ఆకట్టుకుంది. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ప్రిన్సిపాల్స్, డీన్స్, అధికారులు, ఆచార్యులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.