ఘనంగా 72 వ గణతంత్ర దినోత్సవం..
Ens Balu
5
Srikakulam
2021-01-26 18:51:21
శ్రీకాకుళం జిల్లాలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా జరిగాయి. మంగళవారం 72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ ముఖ్య అతిధిగా విచ్చేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, ప్రజలను వుద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యార్ధుల మాస్ డ్రిల్, సాంస్కృతిక కార్యక్రమాలు జిరిగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను, జిల్లా కలెక్టర్లు సన్మానించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సాంప్రదాయం ఆధ్వర్యంలో నమో భారతాంబ నృత్యం, న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్ధులచే కరోనా వారియర్స్ ఏమిచ్చి తీర్చాలి నీ రుణం అనే నృత్యం, సాయి విద్యా మందిర్ విద్యార్ధులచే రైతు రాజ్యం పదరా.పదరా.. పదరా న్యత్యం, పోలాకి కె.జి.బి.వి. విద్యార్ధులచే మన *ఇండియా* నృత్యం, ఆర్.సి.ఎం. లయోలా స్కూల్ విద్యార్ధులచే ఇదే భారత దేశం నృత్యం, ఐ.టి.డి.ఎ. హడ్డుబంగి ఆశ్రమ పాఠశాల విద్యార్ధినుల థింసా న్యత్యాలు అలరించాయి. ఇందులో న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్ధులచే కరోనా వారియర్స్ చేసిన ఏమిచ్చి తీర్చాలి నీ రుణం అనే నృత్యం ఆహూతులను చలింపచేసింది. థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలచింది.
ప్రభుత్వ శకటాలకు బహుమతులుః-
ఈ సందర్భంగా తమ తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలుపుతూ ప్రభుత్వ శకటాల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో సమగ్ర గిరిజనాభివృధ్ధి సంస్థ శకటానికి ప్రధమ బహుమతి, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ శకటానికి ద్వితీయ బహుమతి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటానికి తృతీయ బహుమతి, అటవీశాఖ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ శకటాలకు కనసోలేషన్ బహుమతులు లభించింది.
అనంతరం ప్రభుత్వ విధి నిర్వహణలో ఉత్తమ సేవలను అందించిన ఉద్యోగులు ఎడిషనల్ ఎస్.పి. పి.సోమశేఖర్, జిల్లా విద్యా శాఖాధికారి కె.చంద్రకళ, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, ఐసి.డిఎస్ పిడి జి.జయదేవి, ఎడి హాండ్లూమ్స్ వి.పద్మ, జిల్లా అటవీశాఖాధికారి సి.హెచ్.కృపావరంజిల్లా పంచాయితీ అధికారి వి. రవికుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు ఎ.డి. కె. ప్రభాకరరావు, ఎపిఎస్ డబ్ల్యు.ఆర్.ఇ.ఐ. కో-ఆర్డినేటర్ వై.యశోదలక్ష్మి, తదితర అధికారులకు ప్రశంసా పత్రాలను బహూకరించారు.
కోవిడ్ వారియర్స్ కు ప్రశంసాపత్రాలు:
2020 సం.లో మానవాళి మనుగడకే కరోనా ముప్పు తెచ్చిన విషయం అందరికీ విదితమే. మన జిల్లా కలెక్టర్ జె.నివాస్ అవిరళ కృషి, నిస్వార్ధ సేవ, యంత్రాంగాన్ని సన్నిధం చేసి కరోనాను ఎదుర్కోవడంలో విశేష కృషి చేయడంతో కరోనా మరణాలు, కరోనా కేసులు మన జిల్లాలో తగ్గు ముఖం పట్టాయి. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్య సేవలను అందించిన వైద్యులు, ఆశా వర్కర్లు, ఎ.ఎన్.ఎంలు, సచివాలయ సిబ్బంది, ప్రత్యేక అధికారులకు ప్రశంసా పత్రాలను అందించడం విశేషం
జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్ధ, జిల్లా నీటియాజమాన్య సంస్ధ, బి.సి.కార్పోరేషన్, ఎస్.సి.కార్పోరేషన్, వ్యవసాయ శాఖ, ఐ.టి.డి.ఎ, తదితర ప్రభుత్వ శాఖలు తమ శాఖలు నిర్వహిస్తున్న వివిధ అభివృధ్ధి కార్యక్రమాలు, పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. కార్యక్రమ వ్యాఖ్యాన కర్తగా వావిలపల్లి జగన్నాధం నాయుడు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి జి.రామకృష్ణ, , జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్, సంయుక్త కలెక్టర్లు కె.శ్రీనివాసులు, సుమీత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ గనూర్ ధనుంజయ, ట్రైనీ కలెక్టర్ నవీన్, జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులు, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కె.సి.నాయక్, శ్రీకాకుళం, పాలకొండ రెవెన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిశోర్, టి.వి.ఎస్.జి. కుమార్, నగర పాలక సంస్థ కమీషనరు పి.నల్లనయ్య, తదితరులు పాల్గొన్నారు.