కార్పొరేషన్ల ఏర్పాటు మంచి పరిణామం..
Ens Balu
3
Visakhapatnam
2021-02-02 18:52:09
రాష్ట్రంలో కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం మంచి పరిణామమని మాజీ కేంద్ర మంత్రి,బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు, పాట్నా వర్సిటీ ఆచార్యులు సంజయ్ పాశ్వాన్ అన్నారు. మంగళవారం ఆయన ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని సందర్శించి, వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ పరిశోధనలు, పేటెంట్లు తదితర అంశాలపై వీసీ వివరించారు. విశాఖ కాస్మోపాలిటన్ సిటీగా నిలుస్తుందన్నారు. నగర ప్రాధాన్యత గుర్తించిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి వివాఖను పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రనలుమూలలా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని వివరించారు. వీటిని ఆధారంగా చేసుకుని సంక్షేమ పథకాలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
ఈ సందర్భంగా ఆచార్య సంజయ్ పాశ్వాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని తాను త్వరలో కలుస్తానన్నారు. కార్పొరేషన్ల ఏర్పాటు చేయడానికి గల కారణాలు, వీటి పనితీరు, ఏర్పాటు పర్యవసానాలు, అభివృద్దికి దోహదపడే విధానాలపై అధ్యయనం చేయడం ఎంతో అవసరమని సూచించారు.ఈ దిశగా విశ్వవిద్యాలయం ఆచార్యులు కృషిచేయాలని తెలిపారు. యువ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ వెళుతున్నారన్నారు. విశాఖ నగరంలో అన్నీ ఉన్నాయన్నారు. ఇక్కడ ప్రజల సంస్కృతులు, జీవనం ఎంతో ఉన్నతమైనదన్నారు. సంస్కృతే నిజమైన బలమన్నారు. కళలు, నైపుణ్యాలు మన దేశంలో దర్శనమిస్తాయన్నారు. అనంతరం వర్సిటీ తరపున ఆచార్య సంజయ్ పాశ్వాన్ను సత్కరించి, వర్సిటీ జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, గెస్ట్హౌస్ డీన్ ఆచార్య టి.షారోన్ రాజు, విశ్రాంత ఆచార్యులు క్రిష్ణయ్య, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.