బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత..
Ens Balu
2
Vizianagaram
2021-02-03 17:35:14
అనాధ పిల్లల్ని శిశు గృహాలలో స్వంత పిల్లల్లా చూసు కుంటున్నారని, శిశు గృహాల సిబ్బంది అబినందనీయులని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి(జువనల్ జస్టిస్ బోర్డు) బి.శిరీష పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా చైల్డ్ లైన్ సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధి గ హాజరైన శిరీష మాట్లాడుతూ అనాధ పిల్లలు, తప్పిపోయిన, భిక్షాటన చేస్తున్న, బాల కార్మిక పిల్లల పట్ల కరుణా భావాన్ని చూపించడం మానవ ధర్మమన్నారు. అనాధలను దత్తత నివ్వడం వలన వారికి మంచి భవిష్యతు దొరుకుతుందని అన్నారు. బాలల ను రిమాండ్ లో ఉంచడానికి జిల్లాలో సరైన షెల్టర్ హోం లేదని, విశాఖపట్నం తరలించవలసి ఉంటుందని, జిల్లాలో ఒక హోం ను మజురు చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసారు. జువనల్ జస్టిస్ బోర్డు లోని అంశాలకు విఘాతం కలగకుండా పోలీస్ అధికారులు చూడాలని అన్నారు. బాల నేరాలను అరికట్టడానికి కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని అన్నారు.
ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ బాలల హక్కుల రక్షణ పై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల్ని కూడా తుప్పల్లో పడేసిన అమానుషమైన సంఘటనలు జరుగుతున్నాయని, అలంటి బాలల కోసం ఉయ్యాలా అనే పధకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రధానమైన 14 ప్రాంతాల్లో ఈ ఉయ్యాలా పధకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ ఉయ్యాలా కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి స్వచ్చంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు. అనాధలను దత్తత తీసుకోవాలనుకునే వారు ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకుంటే వారి అర్హతలను బట్టి వారికీ దత్తత నివ్వడం జరుగుతోందన్నారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు సహకరిస్తున్నారని, బాల్య వివాహాలపై గ్రామాల్లో అవగాహన కల్పించడం జరుగుతోందని అన్నారు.
ఈ సమావేశంలో దిశా పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి త్రినాద్, స్వచంద సంస్థల ప్రతినిధులు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి లక్ష్మి, కార్మిక, విద్య శాఖ, పోలీస్, వైద్యారోగ్య తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.