ప్రభుత్వ నిబంధనల మేరకే ఎన్నికలు..
Ens Balu
3
Chittoor
2021-02-08 19:56:16
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు కోవిడ్ నియమ నిబంధనల అనుసరించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 9 న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా చిత్తూరు డివిజన్ కు సంబంధించి 20 మండలాలలోని 342 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో 468 గ్రామ పంచాయతీలకు గాను వివిహ కారణాల వలన 14 పంచాయతీలకు, 138 వార్డులకు ఎన్నికలు నిర్వహించబడడం లేదు. కాగా 454 గ్రామ పంచాయతీలకు మరియు 4,142 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహించవలసి ఉండగా అందులో 112 గ్రామ పంచాయతీలు, 2,635 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయినందున మిగిలిన 342 సర్పంచ్ లకు మరియు 1,507 వార్డు మెంబర్ లకు మంగళవారం నాడు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడతలో 342 సర్పంచ్ స్థానాలకు గాను 925 మంది, 1,507 వార్డ్ మెంబర్ల స్థానాలకు గాను 2,928 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 2,241 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 355 అత్యంత సమస్యాత్మక మరియు 401 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు 137 మంది మైక్రో అబ్జర్వర్లను, 117 వెబ్ కాస్టింగ్ సిబ్బందిని నియమించడం జరిగిందని మరియు ఈ పోలింగ్ కేంద్రాలకు అవసరమైన స్థాయిలో పోలీసు బందోబస్త్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి 3,672 పెద్దవి, 1,901 చిన్న బ్యాలెట్ బాక్స్ లను ఇప్పటికే సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నాయని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు స్టేజ్ – 1 కు 98 మంది ఆరో లు, స్టేజ్ – 2 కు 454 మంది ఆర్ఓ లను, 2609 మంది పోలింగ్ అధికారులు, 4,282 మంది ఓపిఓ లను, 86 మంది జోనల్ ఆఫీసర్లను, 127 మంది రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది మరియు సామగ్రి తరలింపుకు అవసరమైన 182 బస్సుల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొంటున్నారని తెలిపారు. ఎన్నికల సామగ్రి తరలింపుకు 20 సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కోవిడ్ దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి 8,964 మాస్కులు, 2,241 లీటర్ల హ్యాండ్ స్యానిటైజర్లు, 27,500 హ్యాండ్ గ్లౌజ్ లు అందజేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, కవర్లు, బుక్లెట్లు, రబ్బరు స్టాంప్ లు వంటి ఇతర సామగ్రిని ఎంపిడిఓ లకు సమకూర్చడం జరిగిందన్నారు.
మొదటి విడత ఎన్నికలను ఉదయం 6.30 గం. ల నుండి మ.3.30 గం. ల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఆ వెంటనే ఓట్ల లెక్కింపుకు సంబంధించి 342 మంది సూపర్ వైజర్లు, 684 మంది కౌంటింగ్ స్టాఫ్ ను నియమించడం జరిగిందన్నారు.