విజయనగరం డివిజన్ లో 87.09 % పోలింగ్..


Ens Balu
2
Vizianagaram
2021-02-17 17:56:20

విజయనగరం డివిజన్ లో 3వ విడతలో 9 మండలాలలో బుధవారం జరిగిన పంచాయితీ ఎన్నికలలో 87.09 శాతం ఓటింగ్ నమోదు జరిగిందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ వెళ్లడించారు.  ఉదయం 6.30 గంటలకే పోలింగ్ బూత్ ల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైల్లో వున్నారని అన్నారు.    బుధవారం కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి కలెక్టర్ పోలింగ్ సరళిని, కౌటింగ్ ను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.  క్షేత్రస్థాయిలో జరిగిన చిన్న చిన్న సంఘటనల పట్ల అప్పటికప్పుడే స్పందిస్తూ  అధికారులకు, పోలీసులకు తగు సలహాలు, సూచనలు జారీ చేయడమైనదని, ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని వివరించారు.  కౌటింగ్ కూడా త్వరగా పూర్తయ్యేలా ఏర్పాట్లను చేసుకోవాలని పోలింగ్ అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు.  సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్ క్షేత్రస్థాయిలో  పోలింగ్, కౌటింగ్ ప్రక్రియను పరిశీలించి సజావుగా జరిగేలా చూసారు.  సంయుక్త కలెక్టర్ కిషోర్ కుమార్ మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి కౌంటింగ్  ప్రక్రియను పరిశీలించారు. 3వ విడత పోలింగ్ లో మెరకముడిదాం, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, విజయనగరం 9 మండలాలలో 3 లక్షల 60 వేల 181 మంది ఓటర్ల వుండగా ఓటింగ్ ముగిసే సమయానికి 3 లక్షల 13 వేల 679 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఉదయం 8.30 గంటలకు 15.3 శాతం, 10.30 గంటలకు 50.7 శాతం, 12.30 గంటలకు 78.5 శాతం, 2.30 గంటలకు 84.6 శాతం నమోదు కాగా పోలింగ్ ముగిసే సమయం 3.30 గంటలకు  87.09 శాతం నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు.  అత్యల్పంగా గరివిడి మండలంలో 81.83 శాతం నమోదు కాగా, అత్యధికంగా 91.43 శాతం నెల్లిమర్ల మండలంలో నమోదయిందని తెలిపారు.