కెజిబివి విద్యార్ధినులకు అవగాహన..


Ens Balu
2
Srikakulam
2021-02-19 21:29:32

కెజిబివి పాఠశాల విద్యార్ధినులకు వన్ స్టాప్ సెంటర్ ద్వారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహనా కార్యక్రమాన్ని  నిర్వహించారు.  శుక్రవారం,సింగుపురం కెజిబివి పాఠశాల విద్యార్ధినులకు  బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, కిడ్నాప్, డొమెస్టిక్ వయెలెన్స్, తదితర అంశాలపై వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అవగాహన కల్పించారు.  బాల్య వివాహాల వలన ఆడపిల్లల ఆరోగ్యం పాడవుతుందని, పిల్లలు బలహీనంగా పుడతారని తెలిపారు.  ఆడపిల్లల చదువు మధ్యలో ఆగిపోవడం జరుగుతుందని చెప్పారు.  బాల్య వివాహాలపై ఫోన్ నెం.1098 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు.  ప్రేమ పేరుతోను, ఉద్యోగాలు ఇప్పిస్తామని  అమ్మాయిలను మోసం చేసి వేరే రాష్ట్రాలకు అమ్మడం చేస్తున్నారని, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వుండాలని తెలిపారు.  తల్లితండ్రులు, ఉపాధ్యాయుల అనుమతి లేకుండా పరిచయం లేని వ్యక్తులతో పిల్లలు ఎక్కడకీ వెళ్ళరాదని  తెలిపారు. అనంతరం, పోస్కో చట్టంపై అవగాహన కలిగించారు. 18 సం.లలోపు అమ్మాయిలను ప్రేమ పేరుతో  పెళ్ళి చేసుకోవడం వలన పోస్కో చట్టం ద్వారా జైలు శిక్షను వేయడం జరుగుతుందని తెలిపారు.  వన్ స్టాప్ సెంటర్ లో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందని, అవసరమైన వారికి పోలీసు సాయం, న్యాయ సహాయం, వైద్య సహాయం  అందించడం జరుగుతుందని తెలిపారు.  వన్  స్టాప్ సెంటర్ కు ఆశ్రయానికి వచ్చిన వారికి స్వధార్ హోమ్, స్టేట్ హోమ్ నందు ఆశ్రయం కల్పించడం జరుగుతుందని తెలిపారు.  కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వై.హిమబిందు, కెజిబివి ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.