అనవసరంగా కోవిడ్ కేర్ సెంటర్లో తిరగొద్దు..
Ens Balu
4
కాకినాడ
2021-05-04 15:03:46
కోవిడ్ వైరస్ ఉద్ధృత వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రికి వచ్చేవారు ఎక్కువగా అటూ ఇటూ తిరగకుండా చూడాలని.. వచ్చిన వారిని వచ్చినట్లుగా ట్రయాజింగ్ చేసి వారి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఇన్పేషెంట్/సీసీసీ/హోమ్ ఐసోలేషన్పై నిర్ణయం తీసుకోవాలని జేసీ (డీ) కీర్తి చేకూరి వైద్యాధికారులకు నిర్దేశించారు. మంగళవారం సాయంత్రం జేసీ (డీ) కీర్తి చేకూరి.. అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కాకినాడ జీజీహెచ్ను సందర్శించారు. అవుట్ పేషెంట్, ట్రయాజింగ్, ఇన్పేషెంట్ రిజిస్ట్రేషన్ కౌంటర్లను పరిశీలించి.. రోగుల సహాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వారికి వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలిచ్చారు. అవసరం మేరకు బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేయాలని, ఆసుపత్రి ప్రాంగణంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంబులెన్సుల ప్రవేశం, నిర్గమనం సజావుగా జరిగేలా మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్పేషెంట్ బ్లాకుల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి, పూర్తిస్థాయిలో వైద్య, ఇతర సౌకర్యాలు అందేలా చూడాలని జేసీ పేర్కొన్నారు. జేసీ వెంట ఆర్ఎంవో డా. ఇ.గిరిధర్, వైద్యాధికారులు ఉన్నారు.