కోవిడ్ నుంచి రక్షణ కల్పించేందుకు జిల్లాలో 2వ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి జిల్లాలో కోవిషీల్డ్ తో బాటు కొవేక్షిన్ టీకా కూడా వేయడం జరుగుతుందని తెలిపారు. కోవెక్సిన్ రెండో డోసు కోసం ఇటీవలే జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాలను, కోవిషీల్డ్ కోసం 43 కేంద్రాలను పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కేంద్రాలలో శనివారం వేక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. నిపుణుల కమిటీ ను సంప్రదించిన తరువాత కేంద్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ కాల వ్యవధిని తాజాగా పెంచిందన్నారు. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కోవిషిల్డ్ కు 12 -16 వారాల కాలవ్యవది మధ్య, అలాగే కోవాక్సిన్ కు 4 వారాలు దాటిన వారు 2వ డోస్ వేసుకోవాలన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా కోవిన్ సాఫ్ట్ వేర్ ను మార్పు చేసి తిరిగి ఈ నెల 15వ తేదీ ( శనివారం) నుండి జిల్లాలో 2వ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఏ రోజు ఎవరికి టీకా వేస్తారో , ఏ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలో.. నిర్దిష్టంగా 24 గంటల ముందే ఫోను కాల్, ఎస్.ఎం.ఎస్. ద్వారా.. జిల్లా యంత్రాంగం సమాచారం అందిస్తుందన్నారు. ఆలాగే వాలంటీర్లు, ఆశా వర్కర్ల ద్వారా వాక్సినేషన్ స్లిప్ ను అందచేయడం జరుగుతుందన్నారు. సదరు సమాచారం అందుకున్న వారే సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి సంయమనం, సామాజిక, భౌతిక దూరం పాటిస్తూ.. ఫేస్ మాస్కులు, ధరించి.. స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ టీకాలు వేయించుకోవాలన్నారు. మిగిలిన వాళ్లకు అవకాశం వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సదరు సమాచారం అందుకున్న వారే వ్యాక్సినేషన్ కేంద్రానికి హాజరవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ కోవిషీల్డ్ వేసుకొని 84 రోజులు, కోవెక్సిన్ వేసుకొని 28 రోజులు దాటిపోయినవారికి, సమాచారం రాకపోయినప్పటికీ, వేక్సిన్ కేంద్రానికి వెళ్లవచ్చని సూచించారు.