కరోనా కట్టడికి పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా జిల్లాలో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. అందరి సమిష్టి కృషివల్లే ఇది సాధ్యపడుతోందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా చేపట్టిన చర్యల్లో, ఇప్పటికీ మన జిల్లా మెరుగైన స్థానంలో ఉందని తెలిపారు. విజయనగరం జిల్లాలో కరోనా నియంత్రణ కు సమిష్టి కృషి జరుగుతోందని తెలిపారు. రోజుకు 3,500 నుంచి 4 వేల వరకూ కరోనా నిర్ధారణా పరీక్షలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ నెల మొదటి వారంలో 25,416 పరీక్షలను నిర్వహించగా, 6,737 పాజిటివ్ కేసులు వచ్చాయని, రెండో వారంలో 22,220 టెస్టులు నిర్వహించగా, 5,851 పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు. మే నెలలో అత్యధికంగా ఇన్ఫెక్షన్ రేటు నమోదైనప్పటికీ, ప్రస్తుతం కొద్దిగా తగ్గుముఖం పడుతోందని చెప్పారు. ఏప్రెల్ నెలలో 77,352 పరీక్షలు నిర్వహించగా, 9,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందించడంలో వైద్యులు, సిబ్బంది చూపిస్తున్న అంకితభావం, చిత్తశుద్ది కారణంగా, జిల్లాలో రికవరీ రేటు అత్యధికంగా సగటున 85.7 శాతం నమోదవుతోందని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లలో 95.9 శాతం, హోమ్ ఐసోలేషన్లో 83.8 శాతం, ఆసుపత్రుల్లో 87.3 శాతం రికవరీ రేటు ఉండటమే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
జిల్లాలో ప్రస్తుతం 6,662 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని, వీరిలో 6,115 మందికి కోవిడ్ కిట్లను పంపిణీ చేయడం ద్వారా, 91.79శాతాన్ని సాధించి, మన జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఫీవర్ సర్వే జోరుగా జరుగుతోందని, ఇప్పటివరకు సుమారు 35.23 శాతం పూర్తయ్యిందన్నారు. జిల్లాలో 7,47,312 వాసాలకు గానూ, ఇప్పటివరకు 2,63,248 ఆవాసాల్లో సర్వే పూర్తయ్యిందని తెలిపారు. జిల్లాలో మరోవైపు వేక్సినేషన్ ప్రక్రియ జోరుగా జరుగుతోందని, దీనికోసం 67 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో 44 కేంద్రాల్లో కోవిషీల్డ్, 23 కేంద్రాల్లో కోవేగ్జిన్ వేస్తున్నారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,53,861 మందికి మొదటి డోసు, 102432 మందికి రెండో డేసు వేయడం జరిగిందని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.