వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ద్రుఢ సంకల్పంతో పనిచేస్తున్నారని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. సీఎం వీడీయో కాన్ఫరెన్సు అనంతరం జిల్లా కలెక్టర్ డా.హరిజహర్ లాల్, మత్స్యశాఖ ఉప సంచాలకుడు ఎన్.నిర్మలకుమారిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మత్స్యకార సోదరుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. మత్స్యకార భరోసా పథకం వల్ల జిల్లాలో 2953 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. వేట నిషేధ కాలంలో గత ప్రభుత్వాలు అందించిన సాయంతో పోలిస్తే ఇప్పుడు అందిస్తున్న రూ.10వేలు చాలా ఎక్కువని ఉద్ధాటించారు. మత్స్యకారులకు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేశారని గుర్తు చేశారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలోని మత్స్యకారులకు ఈ ఆర్థిక తోడ్పాడు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. పూసపాటిరేగ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. మత్స్యకారుల జీవనోపాధి పెంపుదలకు ఈ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని పేర్కొన్నారు. వేట నిమిత్తం దారి తప్పిపోయిన మత్స్యకారులను బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి విడిపించి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అలాగే జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కట్టడికి అధికారులు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే అన్నారు. విభిన్న పద్ధతులు ఆచరిస్తూ కోవిడ్ సేవలందిస్తున్నారని కితాబిచ్చారు. మరిన్నిసేవలందించి ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జేసీ కిశోర్ కుమార్, జిల్లా మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ బర్రె చినప్పన్న, మత్స్యకార నాయకులు మైలపల్లి నర్శింహులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.