కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న తరుణంలో ప్రజలంతా రెండు లేయర్లు ఉన్న నాణ్యమైన మాస్కులు ధరించడం ద్వారా కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం వుంటుందనే ప్రభుత్వ సూచనను పాటించాలని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి సూచిస్తున్నారు. ఆదివారం ఈ మేరకు విజయనగరంలో ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సాధారణ మాస్కుల కంటే రెండింతలు పటిష్టంగా ఉండే మాస్కు ధరించడం ద్వారా వైరస్ దరిచేరే అవకాశం తక్కువగా వుంటుందనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించాలన్నారు. బౌతిక దూరం పాటిస్తూ, ఎల్లప్పుడూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఏ పనిచేసినా చేతులను సబ్బుతో కడుక్కోవడంతోపాటు, నాణ్యమైన శానిటైజర్లను వినియోగించడం ద్వారా చేతులకు తెలియకుండా అంటే వైరస్ ను నాశనం చేయడానికి అవకాశం వుంటుందన్నారు. అదేవిధంగా మత్స్యకారులెవరూ బయటకు రావొద్దని, ఏ అవసరం వున్నా మత్స్యకార మిత్రాలను సంప్రదించాలన్నారు. కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మత్స్యకారులు గుంపులు గుంపులుగా చేరకూడదన్నారు. ప్రజలు ప్రభుత్వానికి స్వచ్చందంగా సహకరిస్తే అనుకున్న సమయం కంటే ముందుగానే కరోనా వైరస్ ను నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని నిర్మలకుమారి సూచిస్తున్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని, నిత్యం వేడి నీరు తీసుకుంటూ, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చునన్నారు. అదే విధంగా యోగా ప్రాణాయామం చేయడం ద్వారా ఆక్సిజన్ లెవల్స్ ను పెంచుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.