తూర్పు మధ్య బంగాళాఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం తీవ్ర తుఫాన్ గా మారనున్న దృష్ట్యా తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి జవాహర్ లాల్ తెలిపారు. సోమవారం పూసపాటి రేగ మండలం కోనాడ గ్రామం సముద్ర తీరం వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడి ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులతో మాట్లాడుతూ ఎవ్వరూ సముద్రం లోనికి వెళ్లరాదని, తుఫాన్ తీరం దాటే సమయం లో గాలులు, భారీ వర్షాలు ఉంటాయని, తుఫాన్ తీరం దాటే వరకు జాగ్రత్తగా ఉండాలని, సముద్రపు అలలు పెరిగిన, గాలులు వీచినా, ఏదైనా విపత్తు జరిగినా వెంటనే తెలియజేయాలని అన్నారు. అధికారులు కూడా తీరం దాటే వరకు తీర ప్రాంతాల్లోనే ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని తమ దృష్టి లోకి తేవాలని ఆదేశించారు. అనంతరం సమీపాన ఉన్న తుఫాన్ షెల్టర్ ను సందర్శించారు. తుఫాన్ సమయం లో నిత్యవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షెల్టర్ లో నిల్వలు ఉంచాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. యాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి , ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఈ పర్యటనలో సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, రెవెన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.