వేదవిజ్ఞాన పీఠంలో పూర్వాషాడా నక్షత్రేష్టి..


Ens Balu
2
Tirupati
2021-05-29 11:55:52

ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ‌నివారం తిరుమల ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో పూర్వాషాడా నక్షత్రేష్టి మహాయాగం నిర్వహించారు.  ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పూర్వాషాడా మహాయాగంలో విశేషమైన హోమం చేపట్టి అధిష్టాన దేవతను ప్రార్థించారు.  మే 9న ప్రారంభమైన నక్షత్రసత్ర మహాయాగం జూన్ 15వ తేదీ వరకు జరుగనుంది. కృత్తికా నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు అభిజిత్ నక్షత్రం సహా 28 నక్షత్రాల అధిష్టాన దేవతలకు  శ్రౌతయాగాలు నిర్వహిస్తున్నారు.  ఆ తరువాత చంద్రుడు, అహోరాత్రములు, ఉషఃకాలం, నక్షత్ర సామాన్యము‌, సూర్య భగవానుడు, దేవమాత అయిన అదితి, యజ్ఞ స్వరూపుడైన విష్ణువుకు శ్రౌతయాగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోని ప్రజలందరూ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటారు. ఈ యాగాల ద్వారా ఆయా అధిష్టాన దేవతలు తృప్తి చెంది విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తారని పండితులు తెలిపారు. కార్యక్రమంలో పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, టిటిడి బోర్డు స‌భ్యులు శివ‌కుమార్‌ పాల్గొన్నారు.

సిఫార్సు