మరింత మెరుగైన సేవలు అందించండి..
Ens Balu
2
Srikakulam
2021-06-08 12:17:09
కోవిడ్ సమయంలో బాగా పనిచేశారని కృష్ణా జిల్లాకు బదిలీ పై వెళుతున్న కలెక్టర్ జె. నివాస్ పేర్కొన్నారు. మంగళవారం రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తదితరులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చాలా బాగా పనిచేసారన్నారు. అందరి సమిష్టి కృషితో కరోనా రెండవ దశను అరికట్టగలిగామని అన్నారు. మరింత మెరుగైన వైద్య సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎవరినైనా నొప్పించి మాట్లాడితే వాటిని మనసులో ఉంచుకోవద్దని చెప్పారు. డైరెక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికి భయపడుతున్న సమయంలో జిల్లా కలెక్టర్ గా మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు ఎంతో అధ్భుతమైనవన్నారు. ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్ లు, సిటి స్కాన్ ,ఎంఆర్ఐ స్కాన్ వంటివి తెప్పించి శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ లో చాలా మంది ప్రాణాలు కాపాడారని కొనియాడారు. ప్రజల్లో సుస్థిరమైన స్థానం సంపాదించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కృష్ణ మూర్తి, డాక్టర్ చలమయ్య, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.