మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని దివ్యాంగులకు (వివిధ ప్రతిభావంతులు) ప్రత్యేక వ్యాక్సినేషన్ ను ఆరిలోవ (ఎఫ్.ఆర్.యు) సెంటర్ లో వేస్తారని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. మంగళవారం దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రతిభావంతులు నగర మేయర్ ను క్యాంప్ ఆఫీసులో కలసి వారి సమస్యలపై, కోవిడ్ వ్యాక్సినేషన్ కొరకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. నగర మేయర్ వెంటనే స్పందించి జివిఎంసి ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రితో మాట్లాడి ఆరిలోవ(ఎఫ్.ఆర్.యు) సెంటర్ లో దివ్యాంగుల కొరకు ప్రత్యేక వాక్సినేషన్ సెంటర్ ను తెరవాలని ఆదేశించారు. స్పందించిన వైద్యాధికారి, రేపటి(బుధవారం) నుంచి ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినతిపత్రంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని పరిశీలించి అవి అమలయ్యే విధంగా చూస్తానని మేయర్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు సురేష్ మేనన్, రామదాసు శ్రీనివాస రావు, తిరుపతి, మోహన రావు, 11వ వార్డు ఇంచార్జ్ గొలగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.